హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్కు రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి మీద ధ్యాస తప్ప మరేది ఉండదని, పనితనం తప్ప పగతనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆయనకు పగపైనే ధ్యాస ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ జైల్లో ఉండేవారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సాధించిన కేసీఆర్ ఓ వైపు, ఉద్యమ ద్రోహులు రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి మరోవైపు ఉన్నారని, ప్రజలు ఏ వైపు ఉంటారో తెల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్గఢ్లో వాస్తవంగా ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
శనివారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, ఆయన సతీమణి చెరుకు లక్ష్మి, అలేరు నియోజకవర్గ కేహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొప్పుల హరిదీప్రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు టీ హరీశ్రావు, జీ జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో చేరడం ఘర్ వాపసీ అని అభివర్ణించారు. ఉద్యమంలో మొదటగా జైలుకెళ్లిన చెరుకు సుధాకర్ తిరిగి పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. వీరి రాకతో నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ది ఏ డీఎన్ఏ?
తన డీఎన్ఏలోనే బీజేపీ వ్యతిరేక పోరాటం ఉన్నదని చెప్పుకొనే రాహుల్గాంధీ.. రేవంత్రెడ్డి డీఎన్ఏలో ఏముందో చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేవంత్ డీఎన్ఏలో ఏబీవీపీ ఉందా? బీజేపీ ఉందా? టీడీపీ ఉందా? కాంగ్రెస్ ఉందా? అని నిలదీశారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావడం లేదని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉన్నదని మండిపడ్డారు.
ఇప్పుడు సీటుకు నోటు అని కాంగ్రెస్ వారే ధర్నాలకు దిగుతున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి లహర్ (గాలి) లేదు.. జహర్ ( విషం) ఉన్నది అని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు 40, 45 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు నీతులు చెప్తున్నాడని, ఈ విషయాన్ని రాహుల్గాంధీ గమనించాలని కోరారు. రాహుల్కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాహుల్గాంధీ తన పేరును రాంగ్గాంధీగా మార్చుకోవాలని చురకలంటించారు.
టికెట్లు అమ్మినట్టే రాష్ర్టాన్ని అమ్మేస్తారు!
కేసీఆర్ను పార్టీలకు, కులమతాలకతీతంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నేడు కరువు లేదు.. కర్ఫ్యూ లేదని అన్నారు. కాంగ్రెస్ వస్తే కరువులు, కర్ఫ్యూలు వస్తయని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు టికెట్లు అమ్ముకొనే కాంగ్రెస్ నాయకులకు ఓటేస్తే రేపు రాష్టాన్ని కూడా అమ్ముకుంటారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ముఠాలు, కుర్చీల కొట్లాటతోటి రాష్ర్టాన్ని దెబ్బతిసే ప్రమాదం ఉన్నదని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని అన్నారు. రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే ప్రజలు సంతోషంగా, సురక్షితంగా ఉంటారని చెప్పారు.
తెలంగాణ వచ్చాక ఫ్లోరోసిస్హ్రిత రాష్ట్రంగా మారిందని కేంద్రమే చెప్పిందని అన్నారు. నిమ్మకాయ, బత్తా యి మార్కెట్ తెచ్చుడు కాంగ్రెస్ వారికి చేతకాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. తిరుపతిని తలపించేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. దామెరచర్లలో అల్ట్రా మెగా పవర్ప్లాంట్ వస్తుందని తెలిపారు.
మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉమ్మడి నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ అని, నల్లగొండలో ఐటీ టవర్ తెచ్చామని, ఫ్లోరోసిస్ సమస్య లేకుండా చేశామని చెప్పారు. ప్రతి మహిళకు రూ.3వేలు ఇచ్చే విధంగా సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటకలో అక్రమం గా లంచాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని, ఆ డబ్బును మన మీద చల్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎవరి చేతుల్లో ఉండాలో ఆలోచించాలి: కేటీఆర్
‘మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటే పది సార్లు, పది విధాలుగా ఆలోచిస్తాం. అలాంటిది రాష్ర్టాన్ని అప్పగించాలంటే ఎంతగా ఆలోచించాలి. గొప్పగా సాధించుకున్న రాష్ట్రం, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రం ఎవరి చేతిలో ఉండాలో ఆలోచించాలి’ అని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.
46 రోజులపాటు కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్సహా జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న, హర్దీప్రెడ్డిలాంటి వాళ్లు పార్టీలో చేరడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమకారులు ఒక్కటికావాలి: జగదీశ్రెడ్డి
తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు ఏకమవుతున్నాయని, ఇది తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదమని మంత్రి జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ఉద్దేశంతోనే ఆయనను ఓడించడానికి ద్రోహులంతా ఒక్కటవుతున్నారని అన్నారు. ఉద్యమకారులందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అకలి తీర్చుకుందని, స్థిరత్వాన్ని సాధించిందని చెప్పారు.
కేసీఆర్ రానే రాదన్న తెలంగాణ తెచ్చాడు. కానే కాదన్న కరెంటు తెచ్చాడు. రెండు వేల పింఛన్ ఇచ్చిండు. రైతు బంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి ఇచ్చిండు. అందరం కలిసి పట్టుబట్టి మూడో సారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలె.
-మంత్రి హరీశ్రావు
మరోసారి కేసీఆర్ సీఎం కావాలి: చెరుకు సుధాకర్
తెలంగాణ ప్రజల తరఫున పోరాటానికి తాను ఎప్పుడు సిద్ధమని చెరుకు సుధాకర్ తెలిపారు. 2014 తరువాత ఎన్నో అనుభవాలను నేర్చుకున్నానని అన్నారు. కేసీఆర్ను మరోసారి సీఎం చేసేలా పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్యాదవ్, పల్లె రవి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రాహుల్!
తెలంగాణలో రాహుల్గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లో అక్కడ ఎకరాకు 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటున్నారని, తెలంగాణలో ఎకరానికి 30 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని, మిగిలినవి ఎవరు కొంటారని ప్రశ్నించారు. కానీ ఇకడ ప్రతి గింజా కొనడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కర్ణాటకలో కరెంట్ ఇవ్వడం లేదని కరెంట్ ఆఫీసులో మొసళ్లు తెచ్చి వదిలేస్తున్నారని, అక్కడ ఐదు గంటలు కూడా కరెంటు రావడంలేదని రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేత ఇక్కడకు వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తా అంటే ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనను యావత్తు దేశమే అనుసరిస్తున్నదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాలని అన్నారు.