మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుమన్తో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..ఎమ్మెల్యే సుమన్ ప్రజలకు ఇచ్చిన మాట కోసం బాధ్యతగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు చెన్నూర్ నియోజకవర్గానికి వచ్చాయన్నారు.
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రూ.1658 కోట్ల నిధులు తీసుకొచ్చిన మహా ఘనుడు బాల్క సుమన్ అని ప్రశంసించారు.
చెన్నూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు, బాల్క సుమన్ పేరు చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతునన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కా లేవన్నారు. రాష్ట్రానికి ఒక్కపైసా తీసుకురాని ప్రతిపక్షాలవి అర్థం లేని వాదనలని కొట్టిపారేశారు.
వేరే రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలే తెలంగాణ సంక్షేమ పథకాలను మెచ్చుకుంటున్నాయి.
అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలనుకునే నాయకుల మోసపూరిత మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులని ప్రజలు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో నేడు నిలిచిపోయే సుదినం అన్నారు. ముఖ్యంగా కోటపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నం తుంతుంగ వాగుపై 8 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల కోటపల్లి మండలంలోని ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యల పల్లి, ఆల్గామా, జనగామ, వెంచపల్లి గ్రామాల దశాబ్దాల కష్టాలు తొలగిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలన్నారు.