సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 25: చేనేత కళారత్న అవార్డు గ్రహీత, సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి చేనేత ప్రతిభను చాటి ఔరా అనిపించుకున్నాడు. ఆయన తయారు చేసిన ఊసరవెల్లి(రంగులుమారే) చీరను మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ నేత కళను మంత్రి అభినందిచారు.
30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితోపాటు వివిధ రంగులు మారే పట్టు పోగులను వినియోగించి నెల రోజుల వ్యవధిలో ఈ చీరను తయారు చేసినట్టు విజయ్ తెలిపాడు. విజయ్ తండ్రి నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశాడు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ్ అనేక చేనేత ప్రయోగాలను చేసి ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నాడు. దబ్బణంలో దూరే చీర, సుగంధాలు వెదజల్లే చీర వంటివి నేసి అబ్బురపరుస్తున్నాడు.