నల్లగొండ రూరల్, జూలై 1 : ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పని రజకులకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో రజక సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని పాలతో అభిషేకించారు.
ఈ సందర్భంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనిని పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు కాకుండా రజక సొసైటీలకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులా లు, స్పోర్ట్స్ హాస్టళ్లు, ఆలయాలు, టూరి జం కార్పొరేషన్ కార్యాలయాలు, ఆర్అండ్బీ గెస్ట్హౌజ్, పోలీస్ డిపార్టుమెంట్, బెటాలియన్, ప్రభుత్వ దవాఖానలు, ఆర్టీసీ, మినిస్టర్ క్వార్టర్స్లో దుస్తులు ఉతికే పనిని రజక సొసైటీలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 102ను జారీ చేసిందని అన్నారు. రజక సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.