హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఇంధన పొదుపు ప్రాముఖ్యతను వివరించేలా ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సోలార్ పవర్ బస్సును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఐఐటీ ముంబైకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సోలంకి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఇంధనంలో 80శాతం శిలాజ ఇంధన ఉత్పత్తులేనని, వీటి వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌజ్ వాయువులు పర్యావరణ మార్పులకు కారణమవుతూ.. మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా రూపొందిస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని అన్నారు. అందుకే కర్బన రహిత ఇంధన వనరుల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎనర్జీ స్వరాజ్ యాత్ర చేస్తున్నదని తెలిపారు. నూటిని నూరు శాతం సౌరశక్తిని వినియోగించేలా ప్రజలను చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర లక్ష్యమని చెప్పారు. ఈ సందర్బంగా ఐఐసీటీ క్యాంపస్ ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలో సోలార్ బస్ను ప్రదర్శించారు. సహజ ఇంధన వనరుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.