హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని శిశు సంరక్షణ గృహాలను ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీ చేసి, లోటుపాట్లను సరిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమస్యలు ఉన్నట్టుగా జిల్లా జడ్జి నివేదికలో ఉంటే వాటిని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు సత్వరమే పరిషరించాలని సూచించింది. శిశు సంరక్షణ గృహా ల్లో శిశువుల మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బాలల హకుల సంఘం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది. శిశు సంరక్షణ గృహాల్లోని పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. నల్లగొండ, దేవరకొండల్లో శిశు సంక్షేమ గృహాలు 45 ఉన్నాయని, వాటి సంఖ్యను ఇంకా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఆడబిడ్డల అమ్మకాలను అడ్డుకునే చర్యలతోపాటు పిల్లల తల్లిదండ్రులకు మన ఇంటి మహాలక్ష్మి పేరుతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పింది. మండల స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించింది. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని, పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపింది. ఇలాంటి చర్యల కారణంగా నల్లగొండ, దేవరకొండ ప్రాంతాల్లోని శిశుగృహాల్లో చిన్నారుల సంఖ్య 20 నుంచి 50 వరకు పెరిగిందని, అవసరానికి సరిపడా నిధులు కూడా పెంచామని తెలియజేసింది. పాలు లేక శిశువులు మరణించలేదని, 2017లో ఇద్దరు చిన్నారులు జ్వరం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా మృతి చెందారని తెలిపింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని నివేదించింది. ప్రభుత్వ వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు.. ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. పిల్పై విచారణను ముగించింది.