యాదాద్రి భువనగిరి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత పట్టు చీరలకు ప్రఖ్యాతిగాంచిన పుట్టపాక ఒకప్పుడు రోగాలకు కేరాఫ్గా నిలిచింది. అద్భుత డిజైన్లతో పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న చేనేత కళాకారులున్న ఈ గ్రామం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందగా.. ఫ్లోరైడ్ విషయంలోనూ అంతేస్థాయిలో ప్రచారంలోకి వచ్చింది. జిల్లాలోని 66 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతోపాటు పుట్టపాక కూడా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా పేరొందింది. 4,600 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇంటికో బాధితుడు అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. పచ్చగా గారలు పట్టిన పండ్లతో ఫ్లోరైడ్ బాధితులు ఇక్కడ తారసపడుతుండగా.. మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు పట్టిపీడిస్తున్న వారు రెండు, మూడేళ్లక్రితం వరకు వంద మందికిపైగా ఉండేవారు. బాధితుల్లో చేనేత కార్మికులే అధికం కాగా.. డయాలసిస్ చేయించుకునేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వారికి నరకయాతనగా ఉండేది. దీనికితోడు షుగర్, లోబీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం కోకొల్లలుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో తరచూ వైద్యశిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉండేది. డయాలసిస్తో బాధపడుతూ ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. అనారోగ్య సమస్యలకు ఫ్లోరైడ్ నీళ్లే కారణం కావడంతో శుద్ధజలాలను అందించాలని ధర్నాలు, నిరసనలతో రోడ్డెక్కిన సందర్భాలు ఎన్నో.
దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వేదికగా నాందిపలికారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే ఫ్లోరైడ్ సమస్యపైనే ప్రధానంగా దృష్టిపెట్టి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2014లో చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్కు శంకుస్థాపన చేసి 2017లో ఆవిష్కరించారు. వెనువెంటనే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. రూ.970.34 కోట్ల నిధులతో చేపట్టిన పనులతో 17 మండలాల్లోని 421 పంచాయతీల పరిధిలో ఉన్న 732 ఆవాసాలకు మిషన్ భగీరథ శుద్ధ జలాలు అందుతున్నాయి. ఫలితంగా జిల్లాలో సాధారణానికి మించి అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్న 66 ఆవాసాల్లో ఫ్లోరైడ్ పీడ విరగడైంది.
గొంతు తడిపే జలం.. ఎముకలను గుల్లచేసి మనుషులను బతికున్న శవాలుగా మార్చింది. కిడ్నీ సమస్యల బారిన పడేసి జీవితాలను నరకప్రాయం చేసింది. మోతాదుకు మించిన ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలకు హానికరం అని తెలిసినా.. ఆ విషాన్నే తాగాల్సిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో జీవచ్ఛవాలుగా బతుకులు వెళ్లదీసిన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపూర్ మండలంలోని పుట్టపాక గ్రామస్థుల కన్నీటి చిత్రమిది. కానీ, స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి ఉద్భవించిన మిషన్ భగీరథ పథకం ఈ గ్రామ రూపాన్నే మార్చేసింది. ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న శుద్ధ జలం ఫ్లోరైడ్ రక్కసిని తరిమేసింది. ఫ్లోరైడ్ మూలంగా కళావిహీనమైపోయిన ఆ ఊరు.. మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక నేడు ఆయురారోగ్యాలతో కళకళలాడుతున్నది. గడిచిన ఏడాదికాలంలో గ్రామంలో కొత్తగా కిడ్నీ సంబంధిత వ్యాధుల కేసులు నమోదు కాకపోవడం విశేషం. స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి నాంది పలికిన గడ్డపైనే విజయ కేతనం ఎగరవేసిన పుట్టపాక గ్రామ ప్రస్థానమిది.
గతంలో పంచాయతీ సరఫరా చేసే ఫ్లోరైడ్ నీళ్లనే వారం రోజులపాటు నిల్వచేసుకుని తాగెటోళ్లం. కొన్నా ళ్లు ఫిల్టర్ నీళ్లను కొనుక్కొని తాగినం. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినంక మా ఇబ్బందులు తీరినయ్. గ్రామంలో కిడ్నీ వ్యాధుల బాధలు పోయినయ్. రూపాయి ఖర్చు లేకుండా గుమ్మం ముందటకే నీళ్లొస్తున్నయ్.
–గంజి కోటేశ్వరి, గ్రామస్థురాలు
తరతరాలుగా వస్తున్న సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారు. ఉమ్మడి పాలనలో ఎన్నోమార్లు ధర్నాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మందులు, మాకుల కోసం ఖర్చుచేయలేక ఎన్నో పేద కుటుంబాలు తల్లిడిల్లినయ్. కిడ్నీ వ్యాధితో ఆరుగురు చనిపోయారు. మిషన్ భగీరథ నీళ్లతో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
–సామల భాస్కర్, సర్పంచు, పుట్టపాక