హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్న ధరణి పోర్టల్ను.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్న ‘కార్డ్’ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశారు. ఇందుకోసం ధరణి పోర్టల్లోని ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ (ఐఎం)-4ఏ కింద ఆప్షన్ ఇచ్చారు. ఈ అనుసంధానంతో భూమికి సంబంధించిన పాత ఈసీలు తీసుకొనే అవకాశం కలుగనున్నది. ఈ మాడ్యూల్తో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడే అవకాశం ఉన్నదని అధికారవర్గాలు తెలిపాయి. ధరణి పోర్టల్ రాకముందు కొందరు వ్యవసాయ భూములను సేల్డీడ్ ద్వారా కొనుగోలు చేసినా.. మ్యుటేషన్ చేయించలేదు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో ఆయా పేర్లు నమోదు కాలేదు. ధరణిలో రెవెన్యూ రికార్డుల వివరాలు మాత్రమే ఉండటంతో ఇప్పటికీ పాత యజమానుల పేర్లే కనిపిస్తున్నాయి. కొందరు ధరణి పోర్టల్లో తాజాగా స్లాట్ బుక్చేసి మరొకరికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కార్డ్, ధరణిని అనుసంధానించడంతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుందని అధికారులు చెప్తున్నారు.