కరీంనగర్ రాంనగర్, ఏప్రిల్ 16: లాటరీ పేరిట వసూలు చేసిన దాదాపు రూ. కోటితో ముగ్గురు నిర్వాహకులు ఉడాయించిన ఘట న కరీంనగర్లో మంగళవారం వెలుగుచూసింది. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలో నిర్వాహకులు ఈ దందా నడపడం గమనార్హం. కరీంనగర్కు చెందిన సైఫొద్దీన్, ఫారూఖ్, ఎండీ అహ్మద్ కలిసి రెండేండ్లుగా ‘ఎస్కే ఫ్రెండ్స్ అండ్ కో’ పేరిట కశ్మీరుగడ్డలో లకీలాటరీని నిర్వహిస్తున్నా రు. కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ, సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతాల నుంచి 13 మంది వరకు ఏజెంట్లను నియమించుకున్నారు.
దాదాపు 560 మంది సభ్యుల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున సుమారు రూ.89 లక్షల 60 వేల దాకా వసూలు చేశారు. లాటరీ ద్వారా ప్రతినెలా కరీంనగర్లోని ఓ గెస్ట్ హౌస్లో డ్రా తీసి గెలిచిన 12 మంది కస్టమర్లకు 12 బహుమతులు ఇచ్చేవారు. ఇలా 14 నెలల వరకు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. 15వ నెల డ్రా తీసినా.. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వలేదు.కొత్తగా డ్రా తీయడం లేదు. అప్పటి నుంచి ఏజెంట్లు, సభ్యులు నిర్వాహకులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. ఈ వ్యవహారంలో నిర్వాహకులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మంగళవారం టూ టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు.