హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మూడు ప్రధాన టెర్మినళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ద్వారా రైల్వే సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రవాణా అవసరాలను తీర్చడం కోసం జంట నగరాలకు పశ్చిమ భాగంలోని లింగంపల్లిలో టెర్మినల్ స్టేషన్ అభివృద్ధి చేసినట్టు తెలిపారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ను మరో టెర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లిలో అతిపెద్ద టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.