Free Bus For Women | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సం క్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు తెలుస్తున్నది.
మహిళల ఉచిత ప్రయాణానికి ఎసరు
మహాలక్ష్మి పథకం అమలులో టీఎస్ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతున్నది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం రూ.11 కోట్ల నుంచి రూ. 18 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగినా, ఆదాయం భారీగా పడిపోయింది. రోజు సంస్థ ఆదాయం రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్లకు పడిపోయింది.
ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రీయింబర్స్మెంట్ చెల్లించే వరకూ ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది. ఈ క్రమంలో సమక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. పల్లెవెలుగు, ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తిస్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఆదేశించినట్టు సమాచారం.
ఇప్పటికే రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బస్సుల్లో మహిళ ఉచిత ప్రయాణాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు రాష్ర్టాల బస్సులపై ప్రభావం
మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తున్నది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గారు.
హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర చిరునామాతో గుర్తింపు కార్డులు ఉన్న మహిళలు రాష్ట్ర సరిహద్దుల వరకు ఫ్రీగా ప్రయాణించి.. అక్కడి నుంచి చార్జీలు చెల్లిస్తున్నారు. దీంతో ఆయా రాష్ర్టాల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కాగా, అంతర్రాష్ట్ర బస్సుల్లోనూ మ హిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్కార్ తాజా నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.