హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూచించారు. ఉపాధి అవసరాలకు తగినట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సుల మూల్యాంకన విధానాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో అధ్యయనం చేయిస్తుండగా, సోమవారం ఇదే అంశంపై హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై సమగ్రంగా చర్చించారు. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఏ తరహా ఉపాధి వైపు వెళ్తున్నారనే వివరాలను వర్సిటీల వీసీలు ఐఎస్బీ ప్రతినిధులకు వివరించారు. విద్యార్థులు కోరుకొనే ఉత్తమ భవిష్యత్తుకు ఈ అధ్యయనం తోడ్పడుతుందని కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్ పేర్కొన్నారు. ఐఎస్బీ ప్రతినిధి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద, ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్ వీ వెంకటరమణ, పలువురు వీసీలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.