వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మార్పు సాధ్యమైంది. సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. తెలంగాణ రాకుంటే ఈ మార్పు సాధ్యమయ్యేది కాదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఆదివారం వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు. గతంలో భూములు ఉన్నా నీళ్లు. కరెంట్, పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారన్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే భూమికి ఉచితంగా సాగునీరు, కరెంట్, సాగుకు రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతుబీమా పథకం కూడా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగవుతున్నది.
ఖాన్ చెరువుకు నీళ్లు తెచ్చే కాలువ పనులు టెండరు కాగానే త్వరలో మొదలుపెడ్తాం. సాగునీటి వాడకంలో వనపర్తి చరిత్ర సృష్టించబోతున్నదన్నారు. యోజకవర్గంలోని ప్రతి ఎకరాను కృష్ణమ్మ నీళ్లతో సాగుచేసే రోజు రాబోతున్నదని మంత్రి తెలిపారు.
రైతులు విభిన్న పంటలసాగుపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. కష్టం చేసే ఓపిక ఉంటే ఉపాధికి ఢోకా లేదు అనే పరిస్థితికి రావాలన్నదే మా ఆలోచన. ప్రయత్నాలు ఫలించేందుకు ప్రజల సహకారం, ఆశీస్సులు కావాలన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులే గాక చేయాల్సిన పనులు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.