హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గురుకుల పనివేళలను సత్వరం మార్చాలని బీసీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ కామన్ టైమ్టేబుల్ను ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల పనివేళలను ఉదయం 8గంటలకే ప్రారంభించాలని, సాయంత్రం యథావిధిగా 4:30గంటలకు కొనసాగించాలని ఆదేశించింది.
మొత్తంగా గంట సమయాన్ని అదనంగా పెంచింది. అంతేకాదు పాఠ్యప్రణాళికను సైతం సంక్లిష్టంగా, నిరంతరాయంగా నిర్వహించేలా రూపొందించింది. ఉదయం 8:15 గంటల నుంచి మధ్యాహ్నం1:25 వరకు 7 పీరియడ్లను ఏకబిగిన విద్యార్థులకు నిర్వహించాలని నిర్ధేశించింది. అందులో పర్సనల్ సమయం కేవలం 15నిమిషాలు మాత్రమే కేటాయించింది.
క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా, ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా పనివేళలను నిర్ధారించిందని సొసైటీల్లోని గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎట్టకేలకు మైనారిటీ, ఇటీవల ఎస్సీ గురుకుల సొసైటీలు కాంగ్రెస్ తెచ్చిన కామన్ టైమ్టేబుల్ను పక్కకు పెట్టేశాయి. గతంలోని పనివేళలను పాటించడం ప్రారంభించాయి. జనరల్, బీసీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ఇప్పటికీ కామన్ టైమ్ టేబుల్ను పాటిస్తున్నాయి. ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కామన్ టైమ్టేబుల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నాయి.