హైదరాబాద్ : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజం, రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సచివాలయంలో బుధవారం తన చాంబర్లో సీఓఇ ( కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ) విద్యార్థులకు మంత్రి ల్యాప్ ట్యాప్లు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాయని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేశంలోనే ఏ రాష్ర్టంలో లేని విధంగా గురుకుల విద్యావిధానాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు అధిక ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని అందరు గమనించాలన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారన్నారు. 2022-23 సంవత్సరంలో ఐఐటీలో 62 మంది, నిట్, ట్రిపుల్ ఐటీల్లో 113 మంది విద్యార్థులు, ఎంబీబీఎస్ 205 మంది, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎనిమిది వందల మంది విద్యార్థులు సీట్లు సాధించారని వెల్లడించారు.
గతంలో ఒక్క కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) ఉండగా తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను 38కి పెంచిందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందని.ప్రతి విద్యార్థి మంచి విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, సాంఘీక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ హన్మంత్ నాయక్, ఓఎస్డీ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.