Chandrababu naidu | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘సిగ్గుందా జీడిగింజా అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట!’ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు కూడా అట్లనే ఉన్నది. మందికి పుట్టిన బిడ్డల్ని మన బిడ్డలని చెప్పుకునే అలవాటు ఇంకా పోవడంలేదాయనకు. తరుచూ ‘మరి, ఆ రోజుల్లో..’ అంటూ మాట్లా డి హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. హైదరాబాద్కు ముగ్గుపోసింది తానేనని, ఐటీ వచ్చింది తన వల్లేనని ఉత్త గప్పాలు కొట్టే బాబు.. తన అబద్ధాలకు అవసరమైతే సత్యనాదెళ్ల, అబ్దుల్కలాం లాంటి పేర్ల నూ అలవోకగా జోడించేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, తనవల్లే జరిగిందనుకునే స్వీయ మానసిక ధోరణి అది. అందుకే సెల్ఫోన్ని కనిపెట్టింది కూడా తానేనని నిస్సంకోచం గా చెప్పుకోగలడు. అలాంటి చంద్రబాబు నోటి నుంచి మరో ఆణిముత్యం రాలిపడింది. హైదరాబాద్ కోకాపేటలో భూమికి ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరా ధర వందకోట్లు పలకడం తన ఘనతేనని చంద్ర‘డాబు’ తాజా గా ప్రకటించేశారు. కోకాపేటకు కోక చుట్టింది తానేనన్నట్టుగా సెల్ఫ్ డబ్బాకు దిగారు.
డాబుల బాబు ఈసారి ఏమన్నారంటే..
చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడిన బాబు.. అప్పట్లో తన చర్యల వల్లే హైదరాబాద్ ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకొచ్చారు. సంపదను సృష్టించడం నేర్పించింది తెలుగుదేశం పార్టీ అని సెలవిచ్చారు. హైదరాబాద్లో తాను వేసిన ఫౌండేషన్తోనే ఇప్పుడు భూముల రేట్లు పెరిగాయ ని, అందుకే కోకాపేటలో భూమి ఎకరానికి వంద కోట్లకు చేరుకున్నదని చెప్పారు. గతంలో కోకాపేటలో ఎకరం భూమి ధర కేవలం 20-30 వేలు మాత్రమే ఉండేదని, కనీసం లక్ష రూపాయలు కూడా ఉండేది కాదన్నారు. అలాంటి ప్రాంతంలో తాను ఫార్మూలావన్ తేవాలనుకున్నానని.. కానీ, వైఎస్ రాజశేఖర్రెడ్డి అడ్డుకున్నాడని చెప్పా డు. తాను నాలెడ్జ్ ఎకానమీని సృష్టించానని, ఆ రోజు తాను సృష్టించిన నాలెడ్జ్ ఎకానమీ వల్లే ఇప్పు డు హైదరాబాద్లో సంపద పెరిగిందని అన్నారు. ఫార్మా, ఐటీ రంగాలు తనవల్లే అభివృద్ధి చెందాయని బాబు చెప్పుకున్నారు.
ఇది ‘యెల్లో’ ఏడుపు
చంద్రబాబుది జేపీలాంటి ఏడుపే. ఇది యెల్లో ఏడుపు. తమను తాము మేధావులుగా చిత్రీకరించుకునే రుగ్మత అది. అసలు సైబర్ టవర్ కు 1993లో దానికి శంకుస్థాపన చేసిందీ అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి. ఆ త ర్వాత సీఎం అయిన చంద్రబాబు ఆ భవనా న్ని పూర్తిచేశారంతే. అంతకుముందే 1987లో హైదరాబాద్లో తొలి ఐటీ కంపెనీ ‘ఇంటర్గ్రాఫ్’ ప్రారంభమైం ది. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక.. దేశాభివృద్ధికి సాఫ్ట్వేర్ రంగం ఊతమిస్తుందని గుర్తించారు. 1992లో మొదటిదశలోనే హైదరాబాద్కు 6 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను మంజూరు చేశారు. కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా ఏర్పడ్డ ఐటీ మంత్రిత్వశాఖ దేశంలోనే తొలిసారిగా అమీర్పేటలోనే ఎస్టీపీఐని ఏర్పాటు చేసింది. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి మాదాపూర్లో సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేయడంతోపాటు అక్కడి ఐటీ పరిశ్రమ కు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది జరిగిన మూడేండ్లకు గానీ చంద్రబాబు అధికారంలోకి రాలేదు. మరి హైదరాబాద్కు ఐటీని తానే తెచ్చానని, సైబరాబాద్కు ముగ్గుపోసింది తానేనని గొప్పలు చెప్పుకోవడం చరిత్రను వక్రీకరించడం, ప్రజల్ని వెర్రివాళ్లుగా భావించడమే.
భూముల విలువ పెంచిన కేసీఆర్ ప్రభుత్వం
రాష్ట్రవిభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దీర్ఘదృష్టితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లింది. శిథిలమైన వ్యవస్థలను కూడదీసుకుని ఒక్కొక్కటిగా తెలంగాణను పునర్నిర్మిస్తున్నది. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నది. వ్యవసాయం దండుగ అని బాబు చెప్పిన చోటనే.. సాగును పండుగ చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం వల్ల నగరాల్లో భూముల ధరలు పెరిగాయి. ఇరిగేషన్ను అభివృద్ధి చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగింది. ఇక్కడి వాతావరణం, భౌగోళిక అనుకూలతలు, ప్రభుత్వ సహకారం కారణంగా హైదరాబాద్కు అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చాయి. ఐటీ ఎగుమతులు పెరిగాయి. వాటి ఫలితంగా హైదరాబాద్ భూమి బంగారు తునకగా మారింది. పదేండ్లుగా తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని గుర్తించలేని చంద్రబాబు.. రెండుదశాబ్దాల కిందటే ఆగిపోయి, ప్రపంచం ఎంత ముందుకెళ్లిందో తెలుసుకోలేకపోయిన బాబు.. ఇప్పుడు ఏపీలో ఓట్ల వేటలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. సోయి తప్పిన బాబు సోది సంగతులకేంగానీ.. ఎవరెంత ఏడ్చినా తెలంగాణ ప్రగతి ప్రయాణం ఆగదు. తోలుబొమ్మలు, దిష్టిబొమ్మలు ఏం మాట్లాడినా.. అది తెలంగాణ దిష్టి పోయేందుకే!
అమరావతి సంగతేంది?
బాబు కట్టిన సైబర్ టవర్కు కోకాపేటకు 7 కిలోమీటర్ల దూరం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి కోకాపేటకు కనీసం డాంబర్ రోడ్డు కూడా లేని పరిస్థితి. అసలు 2004 చివరినాటికి కూడా సైబర్టవర్ చుట్టుపక్కలన్నీ ఖాళీ జాగలే. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కోకాపేటలో కొంతవరకు రియల్ ఎస్టేట్ కదలికలు మొదలయ్యాయి. కానీ అవకాశం దొరికిన ప్రతీచోట తన ఘనతేనని చెప్పుకోవడం అలవాటైన చంద్రబాబు మాత్రం తాను హైదరాబాద్లో సంపద సృష్టించానని, అందువల్లే కోకాపేటలో భూముల రేట్లు పెరిగాయని చెప్పుకోవడం విడ్డూరం. కూట్లో రాయి తీయలేనేడో ఏట్లో రాసి తీసిన అని చెప్పుకున్నట్టుగా ఉంది బాబుగారి యవ్వారం. చార్సౌ సాల్ హైదరాబాద్ను 9ఏండ్లలో నిర్మించానని చెప్పుకునే బాబు.. తనను తాను మరో కులీకుతుబ్షాగా చూపించుకునే బాబు.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా అమరావతికి ఐదేండ్లలో కనీసం పునాదులైనా ఎందుకు తీయలేకపోయిండు? అంతటి ఘనత వహించిన బాబు.. అధికారం వెలగబెట్టిన వెలగపూడిలో ఒక్క శాశ్వత భవనాన్నీ ఎందుకు కట్టలేకపోయిండు? కనీసం అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా ఎందుకు నిర్మించలేకపోయిండు? సంపద సృష్టించింది తానేననే బాబు.. అప్పట్లో ప్రపంచబ్యాంకు బానిసగా మారి, ఆల్విన్ సహా ఎన్ని ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపెట్టారో తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు.