రౌతు మెత్తనైతే… గుర్రం ముందరి కాళ్ల మీద లేస్తుందట! హైదరాబాద్ శివారులోని చెరువుల దుస్థితి కూడా ఇలాగే ఉన్నది. అందునా హెచ్ఎండీఏ చెరువులంటే అందరికీ అలుసే. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చూడరు. రెవిన్యూ, మున్సిపల్ అధికారులది ‘మాకేం సంబంధం?’ అనే ప్రశ్న! చివరకు కాంక్రీట్ జంగిల్లో భూగర్భ జలాలకు జీవంలాంటి నీటి వనరులు కాల గర్భంలో కలిసిపోతున్నాయి. తాజాగా చందన చెరువు పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఏకంగా 36 గుంటల భూమిని ఆక్రమించి, అధికారికంగా క్రమబద్ధీకరించుకొనేందుకు స్కెచ్ వేసినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో కబ్జా స్కెచ్పై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల అడుగులు ముందుకు పడటం లేదు.
Chandana Cheruvu | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్, జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు దాదాపు 34.1 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం వాణిజ్య, నివాసపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్సీఐ (రిసెర్చ్ సెంటర్ ఇమారత్)కు ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉన్నందున 1990లో ప్రభుత్వమే చెరువు శిఖంలోంచి రోడ్డు వేసింది. రోడ్డు అవతల కూడా ఎఫ్టీఎల్ భూములు ఉండటంతో అక్కడి వరకు సర్వే చేసి హద్దులు నిర్ధారించింది. ఇప్పటికీ ఆ హద్దు రాళ్లు ఉన్నాయి. ఆర్సీఐకి ఈ చెరువు నుంచి నీటిని సరఫరా చేసేందుకు శిఖంలో ఒక ట్యాంకు కూడా నిర్మించారు. అయితే, విస్తరించిన పట్టణీకరణ దరిమిలా ఈ ప్రాంతం రద్దీగా మారటంతో రోడ్డును వంద ఫీట్లకు విస్తరించారు. దీంతో రోడ్డు అవతల ఉన్న శిఖం భూములపై కొందరి కన్నుపడింది. కాలక్రమేణా ఇంతింతై అన్నట్టు శిఖం భూములు ఫలహారంగా మారుతూ వస్తున్నది. ఇందులో భాగంగా కొన్నిరోజుల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు శిఖం భూముల ఆక్రమణపై ఫిర్యాదు అందింది.
వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉన్న శిఖం భూమిని హస్తగతం చేసుకునేందుకు కొందరు భారీ స్కెచ్ వేశారు. చెరువు విస్తరించి ఉన్న సర్వే నంబర్లలో 155 కూడా ఉన్నది. ఈ సర్వే నెంబరుపై ఇద్దరు వ్యక్తులు పాత పట్టా పాసు పుస్తకాలు సృష్టించారు. ఒక వ్యక్తిపై 9 గుంటలు, మరో వ్యక్తిపై 27 గుంటల భూమితో జల్పల్లి గ్రామపరిధిలో 155 సర్వే నంబరు మీద పట్టా పాసు పుస్తకం నంబరు 135, 136గా పత్రాలు రూపొందించారు. శిఖం భూమిలో మట్టి నింపి, రెండు గదులను కూడా నిర్మించారు. పాత పట్టా పాసు పుస్తకాల ప్రతుల ఆధారంగా 2022లో విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. మున్సిపల్ నుంచి ఇంటి నంబరు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే 59 జీవో కింద క్రమబద్ధీకరించుకోవాలనేది వీరి ప్రణాళిక. ఇక్కడ గజం విలువ కనీసం రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో 36 గుంటల భూమి ధర కనిష్ఠంగా రూ.50 కోట్ల పైమాటే.
2018లో కేసీఆర్ ప్రభుత్వం పాత పాస్ పుస్తకాల స్థానంలో కొత్త వాటిని జారీ చేసింది. కనీసం ఈ మాత్రం వాస్తవాన్ని పట్టించుకోకుండా విద్యుత్తుశాఖ అధికారులు 2022లో పాత పాస్ పుస్తకాల ప్రతులు మీద మీటర్లు ఇవ్వటం గమనార్హం. దీంతో పాటు 155 సర్వే నంబరు చెరువు శిఖం అని రికార్డుల్లో ఉన్నా రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. పాత పాస్ పుస్తకాల నంబర్లపై ఆరా తీయగా, జల్పల్లి రెవిన్యూ రికార్డుల్లో పట్టా పాస్ పుస్తకాల నంబర్లు 75తోనే ముగిశాయి. అంటే ఇవి నకిలీవని స్పష్టంగా అర్థమవుతున్నది.
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు నేపథ్యంలో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గత నెల 29న కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ తహసీల్దార్కు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ కిందిస్థాయి అధికారులు విచారణకు మాత్రం వెనకా ముందు ఆడుతున్నట్టు తెలుస్తున్నది. కనీసం సర్వే నిర్వహించకపోవటం, ఆక్రమణలను తొలగించకపోవటం వెనక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బాలాపూర్ తహసీల్దార్ మాధవరెడ్డిని సంప్రదించగా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఇంకా తనకు నివేదిక ఇవ్వలేదని, నివేదిక ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు పంపిస్తానని పేర్కొన్నారు.