ఆదిలాబాద్, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్ గంగా నదిపై నిర్మించిన చనాకకోట ప్రాజెక్టు వెటరన్ను అధికారులు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. ఎత్తి పోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, శ్రీనివాస్, పి రవీందర్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. చనాకకోట ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెట్రన్ విజయవంతమైనందున రైతులకు వానకాలం పంటలకు అవసరమైన సాగునీటిని అందిస్తామని అధికారులు తెలిపారు.
కాగా, బుధవారం డ్రైరన్ పూర్తి చేసిన అధికారులు గురువారం వెట్రన్ నిర్వహించారు. బరాజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంప్హౌస్ను నిర్మించి 5.5 మెగావాట్ల సామర్థ్యం గల మూడు మోటర్లు ఏర్పాటు చేయగా ఒక మోటార్ ద్వారా నీటిని కాలువల్లోకి వదిలారు. మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్ మండలం కొరాట వద్ద పెన్గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.