మేడిగడ్డ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు.. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. వందలాది మంది నేతలు, వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వెంటరాగా పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ శాసనసభాపతులు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సబిత ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కదిలారు. మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న డిమాండ్తో చేపట్టిన ఈ యాత్ర విజయవంతమైంది. ఈ యాత్ర పార్లమెంటు ఎన్నికల కోసం కాదని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని, త్వరగా ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లందేలా చూడాలన్నదే తమ లక్ష్యమని ఆ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పింది. ఒకవైపు యాత్రకు బీఆర్ఎస్ పార్టీ పూనుకోవడంతో మరోవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హడావుడిగా మీడియా సమావేశాలు పెట్టి నష్టనివారణ చర్యలకు ప్రయత్నించడమే దీనికి నిదర్శనం.
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు ఊరూరా విశేష స్పందన వచ్చింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నేతలు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సరిగ్గా 8.30 గంటలకు అక్కడి నుంచి మేడిగడ్డకు వాహనశ్రేణి ప్రారంభమైంది. సుమారు 1,000 మంది పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో ఉప్పల్, భువనగిరి, జనగామ, వరంగల్, పరకాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నేతలంతా హైదరాబాద్ నుంచి వస్తున్న వాహన శ్రేణులకు జత కలిశారు. పరకాల, స్టేషన్ఘన్పూర్, మంథని, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నేతలు నేరుగా మేడిగడ్డకే చేరుకున్నారు. మార్గమధ్యంలో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తోరణాలు ఏర్పాటుచేశారు. పలుచోట్ల పటాకలు కాలుస్తూ, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద, లింగాలఘనపురం మండలం నెల్లుట్ల బైపాస్ రోడ్డులో, శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ వద్ద, పరకాల అంబేద్కర్ సెంటర్, గణపురం మండలం గాంధీనగర్ జంక్షన్లో, రేగొండలో, కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ యాత్ర బృందానికి స్వాగతం పలికారు.
జల ప్రదాతకు స్వాగతం, అపర భగీరథుడికి స్వాగతం.. అంటూ ఊరూరా పోస్టర్లు వెలిశాయి. గ్రామాల్లోని ప్రజలు చేతులెత్తి యాత్ర బృందం వాహన శ్రేణికి ఎదురొచ్చి అభివాదం చేశారు. మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకున్న పార్టీ బృందానికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బరాజ్ మొత్తం జనంతోనే నిండిపోయింది. ఒక దశలో పోలీసులు అకడికి వచ్చిన వారిని అదుపు చేయలేకపోయారు. బరాజ్ గేట్లను మూసివేశారు. దీనిపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు బరాజ్ మీదకు అందరినీ అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మేడిగడ్డ బరాజ్లో కుంగిన పిల్లర్లను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. బరాజ్ పైనుంచి, కింది వరకు వెళ్లి గేట్లను కూడా పరిశీలించారు. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లర్ల వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. బృందానికి రిటైర్డ్ ఇంజనీర్లు దామోదర్రెడ్డి, వెంకటేశం, నీటిపారుదల రంగ నిపుణులు వీ ప్రకాశ్ తదితరులు అకడ జరిగిన పరిస్థితిని వివరించారు. దెబ్బతిన్న పిల్లర్లను ఎలా బాగు చేయవచ్చో వివరిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలనూ సూచించారు. ఎమ్మెల్యేల బృందంలో ఉన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు కూడా ప్రభుత్వం పూనుకుంటే ఎలా బాగు చేయవచ్చో చెప్పారు. మేడిగడ్డను పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ బృందం నేరుగా అన్నారం బరాజ్కు చేరుకున్నది. అక్కడ కూడా లోపాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న ప్రాంతాలనూ పరిశీలించింది.
అన్నారం బరాజ్ గడ్డపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం.. బీఆర్ఎస్ వాస్తవాలు’ పేరుతో రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తుండగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిని కనబర్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నపుడు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజకీయంగా తమపై దాడి చేయండి.. ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని కడియం చేసిన వ్యాఖ్యలపై పార్టీ కార్యకర్తలు లేచి నిలబడి అండగా ఉంటామని.. ప్రభుత్వం తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్త కాదని కడియం అంటే.. మేమంతా మీ వెంటే ఉంటామంటూ చప్పట్లతో ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అత్యుత్తమంగా ఉన్నదని లెకలతో సహా మాజీ మంత్రి కేటీఆర్ వివరిస్తున్నంత సేపు కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు. హరీశ్రావు ఒంటిచేత్తో అసెంబ్లీలో కాంగ్రెస్ సరారును నిలదీశారని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టారని చెప్పినపుడు నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలను ప్రజలకు హరీశ్రావు ఏనాడో చెప్పారని వివరించారు. తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత విషయంలో మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలను సాక్షాలతో సహా హరీశ్రావు సభలో వివరించారని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖను సభలో చూపించారని చెప్పారు.
ఉదయం 8.30 గంటలకు మొదలైన బీఆర్ఎస్ బృందం యాత్ర అలసట లేకుండా కొనసాగింది. మేడిగడ్డ, అన్నారం బరాజ్ సందర్శన అర్ధరాత్రి వరకు సాగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఈ యాత్రలో ఆసాంతం పాల్గొన్నారు. ఇంజినీర్ల సంఘం జేఏసీ నేత వెంకటేశం సభాముఖంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతిక అంశాలను వివరించారు. ముమ్మాటికీ ఇకడ నీళ్లు ఉంటాయన్న అంచనాలతోనే ప్రాజెక్టు కట్టారని, మేడిగడ్డకు మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, మరమ్మతులు చేస్తే ఈ ప్రభుత్వానికే పేరు వస్తుందని చెప్పారు. ప్రాజెక్టులకు ఇలాంటి సమస్యలు తలెత్తడం ఇదే తొలిసారి కాదని, ఇలాంటి సమస్యలు వస్తాయని, వచ్చిన సమస్యలను భూతద్దంలో చూపించవద్దని హితవు పలికారు.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా బీఆర్ఎస్ సరార్ కావాలనే రీడిజైన్ చేసిందని ఇటీవల మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణల్లోని డొల్లతనాన్ని మేడిగడ్డ వేదికగా హరీశ్రావు బట్టబయలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల జలాలు అందుబాటులో లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీనే తెలంగాణకు లేఖ రాసిందని వెల్లండించారు. అ లేఖను మేడిగడ్డ వేదికగా చూపారు. ఇదిగో సాక్ష్యం అంటూ ఉత్తమ్ ఆరోపణలను హరీశ్ ఎండగట్టారు.
‘చలో మేడిగడ్డ’ పర్యటనతో బీఆర్ఎస్ పోరాటం ఆగబోదని కేటీఆర్ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లను, రిజర్వాయర్లను, ప్రాజెక్టులను సందర్శిస్తామని తెలిపారు. ప్రజాసమస్యలు, కాంగ్రెస్ హామీల అమలు కోసం కూడా పర్యటనలు చేపడతామని వెల్లడించారు. ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి వెల్లువలా తరలివచ్చిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, ప్రజలకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మేడిగడ్డకు బీఆర్ఎస్ యాత్ర ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభతోనే కృష్ణా నీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచగలిగామని, అప్పటివరకు కేఆర్ఎంబీపై మడతపేచీ పెట్టిన కాంగ్రెస్ సరారు దిగివచ్చిందని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిన నెల రోజుల్లోపే మరమ్మతులు చేస్తామని ప్రకటించారని, ఇది మనం సాధించిన పాక్షిక విజయమని చెప్పారు. హరీశ్రావు ప్రసంగంపై ఆసాంతం హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి. ఉత్తమ్కుమార్రెడ్డి కూడా రేవంత్రెడ్డి తరహాలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హరీశ్రావు చెప్పినపుడు ప్రజల నుంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాజెక్టు అయినా అంచనాలలోపే పూర్తయిందా.. అని హరీశ్రావు ప్రశ్నించారు.