హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో పీఆర్టీయూ టీఎస్ ఉద్యమబాట పట్టింది. కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచడంలో భాగంగా సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు 1న పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పాటిస్తూ ఇందిరాపార్క్లో భారీ ధర్నాను నిర్వహించనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద నీలిరంగు దుస్తులతో మార్చ్ను నిర్వహిస్తామని తెలిపారు. ధర్నాకు హాజరయ్యే వారు నీలిరంగు చొక్కాలు, టీషర్ట్లు, చీరలు ధరించి రావాలని పిలుపునిచ్చారు.
సీఎం హామీని నిలబెట్టుకోవాలి
ఉద్యోగుల జేఏసీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. మే 2న జేఏసీ నాయకత్వంతో జరిపిన చర్చల్లో జూన్ 2న పీఆర్సీ ప్రకటిస్తామని, సీపీఎస్ రద్దుకు కమిటీని వేస్తామని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అమలు అంశాన్ని డిప్యూటీ సీఎం పరిష్కరిస్తారని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జూన్ 2గడిచినా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టును సర్కార్ తెప్పించుకోకపోవడం గర్హనీయమని వాపోయారు. ఏపీలో 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ను అమలు చేస్తున్నా, రాష్ట్రంలో ఇంకా అమలు చేయకపోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మహాధర్నాకు భారీ సంఖ్యలో టీచర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు.