హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో గర్జన సభ ఏర్పాటుచేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపనున్నట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంలో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని నేతలు తెలిపారు.
2న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు, హైదరాబాద్ నగర శాఖ సంయుక్త సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 3న ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, 5న ఖమ్మం, వరంగల్, 7న మెదక్, నిజామాబాద్, 8న ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏల విడుదల, రూ.10వేల కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు, హెల్త్స్కీమ్ సమర్థవంతంగా అమలు, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు పునరుద్ధరణ తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల గర్జన సభ తలపెట్టినట్టు పేర్కొన్నారు.