Sathupalli | సత్తుపల్లి టౌన్/వేంసూరు, ఫిబ్రవరి 2: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగ చర్చకు పిలుపు నేపథ్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు వస్తారనే సమాచారం మేరకు పోలీసులు ఆయా పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సత్తుపత్తిలో రాజకీయ వేడి రాజుకున్నది. తెల్లవారుజామున 4 గంటలకే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. ఆయా నాయకుల ఇండ్లకు వెళ్లిన పోలీసులు.. వారిని నిద్రిలేపి, కనీసం బ్రష్ కూడా చేసుకోనివ్వకుండా తీసుకెళ్లడంతో పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సత్తుపల్లి మున్సిపల్ పాలకవర్గం ఐదేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నందున బీఆర్ఎస్కు చెందిన పాలకవర్గ సభ్యులు గత నెల 31న అభినందన సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సత్తుపల్లిలో అవినీతి రాజ్యమేలుతున్నదని అన్నారు.
‘డీ’ ట్యాక్స్ (స్థానిక ఎమ్మెల్యే రాగమయి భర్త దయానంద్) పేరిట అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సండ్ర వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రత్యారోపణలు చేశారు. వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సత్తుపల్లి అంబేద్కర్ రింగ్సెంటర్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదివారం రెండు పార్టీల నాయకులు సత్తుపల్లి అంబేద్కర్ సెంటర్కు చేరుకుంటారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వారిలో బీఆర్ఎస్ నేతలు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, అద్దంకి అనిల్, గుండ్రు రాఘవేంద్ర, రఫీ, మల్లూరి అంకంరాజు, వీరపునేని బాబి, దొడ్డా శంకర్రావు, నడ్డి ఆనందరావు సహా మొత్తం 19 మంది ఉన్నారు. విషయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తెలియడంతో పెద్ద ఎత్తున సత్తుపల్లి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పొరుగునే ఉన్న వేంసూరు పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సత్తుపల్లిలోని ఎమ్మెల్యే రాగమయి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇండ్లకు వెళ్లారు. తాము అధికార పార్టీ నేతలమని, తమను ఎందుకు అరెస్టు చేస్తారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేసి సత్తుపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. రింగ్సెంటర్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మందిని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాగమయి భర్త దయానంద్.. సత్తుపల్లి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అధికార పార్టీ నేతలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీశారు. అనంతరం పోలీస్స్టేషన్ బయట దయానంద్ మీడియాతో మాట్లాడారు. సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న 15 ఏండ్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ విషయంలో తమ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు పిలిచారని, అందుకు తమ వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు.
నిద్రలో ఉన్నవారిని లేపి అరెస్ట్ చేస్తారా?
ఇక వేంసూరు పీఎస్లోని బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యే సండ్ర పరామర్శించారు. నిద్రిస్తున్న తమ నాయకులను వేకువజామునే లేపి ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించారు. సండ్ర పీఎస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలో గడిచిన ఏడాది పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను రుజువు చేసే విషయంలో తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులను ఇబ్బంది పెట్టే విధంగా తాము నిరసనలు చేపట్టబోమని కల్లూరు ఏసీపీ రఘుకు ఫోన్లో హామీ ఇవ్వడంతో వేంసూరు పీఎస్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ రఘు మాట్లాడుతూ.. రెండు పార్టీల నాయకులు ఆదివారం బహిరంగ చర్చకు వస్తారనే సమాచారంతోనే ముందస్తుగా అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇలాం టి చర్చలు, సభలకు అనుమతి లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే రెండు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.