హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే చేరికలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు (కూతురి కుమారుడు), అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన తరువాత ఇదే తొలి చేరిక కావడం విశేషం. ప్రగతిభవన్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కండువా కప్పి, ఆయనను పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చురుకైన రాజకీయ నాయకుడైన చల్లా వెంకట్రామిరెడ్డికి పార్టీలో తగు స్థానం కల్పించి, ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ జాతీయ విధానాలు నచ్చి తాను బీఆర్ఎస్లో చేరానని, పార్టీ ప్రకటన తర్వాత తొలి చేరిక తనదే కావడం సంతోషంగా ఉన్నదని చల్లా తెలిపారు. అధినేత ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, హరీశ్రావు పాల్గొన్నారు. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి.. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయంగా పట్టు, మంచి పేరు ఉన్న రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, దివంగత చల్లా రాంభూపాల్రెడ్డి ఈయన తండ్రి. కాగా వెంట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా సేవలందించారు. బీఆర్ఎస్లో చేరేందుకు పలువురు రాజకీయవేత్తలు, మేధావులు ఆసక్తి చూపిస్తున్నారు.