నిజామాబాద్ : ధీర వనిత చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చాకలి(చిట్యాల) జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగ నిలిచి ఎందరికో ఆదర్శమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పోరాట స్ఫూర్తిని చాటేలా అధికారికంగా జయంతి, వర్ధంతిని నిర్వహిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాకనే నాటి పోరాటి యోధులకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.