(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో జరిగేవన్నీ అక్రమాలేనని న్యాక్ మాజీ చైర్పర్సన్ పట్వర్ధన్ ఆరోపించారు. ఆదివారం ఆయన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవి పవిత్రత, గౌరవాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్కు ఓ లేఖ రాశారు. న్యాక్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయాలని అనుకొంటున్నట్టు గత నెల 26నే యూజీసీ చైర్మన్కు పట్వర్ధన్ లేఖ రాశారు. ఉన్నత విద్యాసంస్థలకు గ్రేడింగ్, గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అవినీతి పెరిగిపోయిందని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, అనీల్ సహస్రబుద్దెను తదుపరి న్యాక్ చైర్పర్సన్గా నియమిస్తూ మార్చి 3న యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. సహస్రబుద్దె నియామకంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పట్వర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.