నల్లగొండ : మతోన్మాద ఎజెండాతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పినా కరీంనగర్ ఏక్తా యాత్రలో అసోం సీఎం, బండి సంజయ్ మాటల తీరు మారలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Council Chairman) మండి పడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో సీఎం అభ్యర్థిని(CM Candidate) తేల్చలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతుందన్నారు. కర్ణాటక పరిణామాలు గమనిస్తున్న తెలంగాణ ప్రజలు రానున్న కాలంలో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ, అధికారం ఇచ్చినా పాలించే సత్తా లేని కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా చేస్తాయని హెచ్చరించారు.
‘ కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారు. వారి కలలు కల్లలే అవుతాయి. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఇద్దరు నేతలు పోటీ పడితే.. తెలంగాణలో 12 మందికి పైగా పోటీలో ఉన్నార’ ని ఎద్దేవా చేశారు. బీజేపీ మతోన్మాద ఎజెండాను కర్ణాటక ప్రజలు చీకొట్టినప్పటికీ రాష్ట్రంలో హిందూ ఏక్తాయాత్ర పేరుతో విద్వేష రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) సెక్యులర్ పాలనలో ప్రజలు అభివృద్ధి పథంలో సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా విరాజిల్లాలన్నా, కేంద్రంలోని బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్తోనే వామపక్షాలు కలిసి నడుస్తాయని చెప్పారు.