హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. తార్నాకలోని ఆర్టీసీ దవాఖాన ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అందులోని తరగతి గదులు, ల్యాబొరేటరీలను పరిశీలించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ దవాఖానకు అనుబంధంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కళాశాల మేనేజ్మెంట్ కోటాలోని 20 సీట్లలో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు 5 సీట్లు కేటాయిస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు. అనంతరం నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురసారాలతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వీ రవీందర్, తార్నాక ఆర్టీసీ దవాఖాన సలహాదారు, ఓఎస్డీ సైదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సీఈఈ రాంప్రసాద్, సీఎఫ్ఎం విజయపుష్ప, దవాఖాన సూపరింటెండెంట్ శైలజా కృష్ణమూర్తి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర తులసి తదితరులు పాల్గొన్నారు.