సిరికొండ, జూలై 18 : దళితుడిని గౌరవించింది సీఎం కేసీఆరేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. తనను ఉన్నత విద్యామండలి చైర్మన్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్లలో వీడీసీ ఆధ్వర్యంలో మంగళవారం అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో కృషి చేశారని తెలిపారు. గత ప్రభుత్వాలేవీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా దళితుడిని నియమించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంచంద్రం, రిటైర్డ్ జడ్జి నారాయణ, టీయూ మాజీ రిజిస్ట్రార్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.