హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్లో పరీక్షలు పెట్టకుండా సెకండియర్కు ప్రమోట్ చేయాలని, సెకండియర్లోనే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని, పాస్ మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్యవరకు సమగ్ర పాలసీ రూపకల్పనకు ఏర్పాటైన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు గురువారం సీఎం రేవంత్రెడ్డికి నివేదిక సమర్పించారు.
ఈ సందర్భంగా ఆకునూరి మురళి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 305 పాఠశాలలను సందర్శించామని, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో 46 సమావేశాలు నిర్వహించి సమగ్రంగా నివేదికను తయారు చేశామని చెప్పారు. అనేక కీలక సిఫార్సులు చేసినట్టు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు.
రాష్ట్ర విద్యాకమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కొన్ని సిఫార్సులు పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఏబీవీపీ మండిపడింది. ఎప్సెట్ రద్దును వ్యతిరేకిస్తున్నట్టు సంఘం సెక్రటరీ రాంబాబు ప్రకటనలో తెలిపారు. ఎప్సెట్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలని సిఫారసు చేయడం, కార్పొరేట్ కళాశాలల మేలు కోసమేనని ఆరోపించారు.
ఎప్సెట్ రద్దు వల్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోతారని వాపోయారు. మూడేండ్ల డిప్లొమా తరువాత లెటరల్ ఎంట్రీ లేకపోతే అటు ఎప్సెట్ లేకుండా, ఇటు ఇంటర్ మార్కులు లేకుండా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు ఎలా పొందుతారని ప్రశ్నించారు. ఈ లోపభూయిష్టమైన సిఫార్సులను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.
టీచర్లకు ఆటోమెటిక్ ఉద్యోగోన్నతులు రద్దు చేయాలని విద్యాకమిషన్ సూచించింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని, ఐదేండ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయాలని, రెండేండ్లలో పనితీరు మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించాలని సిఫారసు చేసింది.