ఖైరతాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఉద్యమంలో రైతులు, ప్రజలను భాగస్వాములను చేయాలని విద్యుత్తు ఉద్యోగులకు సూచించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ల లాభాల కోసమే కొత్త కరెంటు చట్టాలు’ అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు చట్ట సవరణ బిల్లు ద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఇది చీకటి చట్టమని విమర్శించారు. రాష్ర్టాల నిర్ణయాధికారాలను స్వాధీనం చేసుకోవడం, డిస్కంలను నిర్వీర్యం చేయడం, ప్రైవేట్కు అప్పగించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నదని చెప్పారు. వ్యవసాయరంగం అభివృద్ధి విద్యుత్తుతో ముడిపడి ఉన్నదని, పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగానికి చేసిన మేలు వెలకట్టలేనిదని, స్వయం సమృద్ధి సాధించామని అల్లం నారాయణ పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, సంక్షేమానికి కట్టుబడి ఉండటం శుభసూచికమని చెప్పారు. తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. కొత్త చట్టం అమలైతే డిస్కంల ఉద్యోగులను ప్రైవేట్రంగంలోకి బదలాయించడం, ఉద్యోగాల తొలగింపు, బలవంతపు పదవీ విరమణలతో రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జీ రాములు, తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మామిండ్ల రాజేందర్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి థామస్రెడ్డి, ఇంజినీర్స్ జేఏసీ ప్రతినిధి వెంకటేశం, రిటైర్డ్ ఇంజినీర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధి నాగేశ్వర్రావు, ప్రకాశ్, జాన్సన్, కరెంట్రావు, తుల్జా రామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.