హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కరెంటు గురించి మాట్లాడటం.. కడుపు నిండా మృష్టాన్న భోజనం చేసిన వాడికి పేలాల ఫలహారం పెడతామన్నట్టుగా ఉన్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ లభిస్తున్నదని అన్నారు. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలంగా అలరారుతున్న తెలంగాణకు వచ్చి, మూడు గంటలు కరెంట్ ఇస్తాం, ఐదు గంటల కరెంట్ ఇస్తామని సర్కస్లో బఫూన్లలా మాట్లాడుతుంటే ప్రజలంతా నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు.