హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): నిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్కో-జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. దీనివల్ల ఎక్కువ ధరకు ఇంధన ఎక్సేంజీ ద్వారా విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడం, యాసంగి సీజన్ కావడంతో విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నదని, పనులు త్వరగా పూర్తిచేసి రామగుండంలోని రెండు యూనిట్లను అందుబాటులోకి తేవాలని ఎన్టీపీసీని కోరారు. శనివారం మహారాష్ట్రలోని ఫుణెలో ప్రారంభమైన 45వ సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్సార్పీసీ) సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ట్రాన్స్మిషన్ నష్టాలు 4.49 శాతం ఉంటే.. దక్షిణాది ప్రాంతంలో 3.88 శాతం ఉన్నదని, ఈ విషయంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) చొరవ తీసుకోవాలని సూచించారు.
ఉత్తరాది రాష్ర్టాల్లో ట్రాన్స్మిషన్ నష్టాలు అధికంగా ఉన్నాయని, దీనివల్ల జాతీయస్థాయిలో ట్రాన్స్మిషన్ నష్టశాతాన్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏవైనా పథకాలు అమలు చేసేటప్పుడు జాతీయస్థాయిలో ట్రాన్స్మిషన్ నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఆయా ప్రాంతాల వారీగా నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఎల్డీసీకి సూచించారు. నిరుడు వేసవిలో దేశవ్యాప్తంగా ఏర్పడిన విద్యుత్తు సంక్షోభాన్ని గుర్తెరిగి ముందస్తు చర్యలు తీసుకోవాలని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. తెలంగాణ ట్రాన్స్కో పైలట్ ప్రాజెక్టు కింద 132 కేవీ లైన్ను 220 కేవీ లైన్గా మార్చేందుకు ప్రయత్నించిందని, ప్రస్తుతం ఉన్న కండక్టర్ను హెచ్టీఎల్ఎస్ కండక్టర్తో మార్పు చేస్తూ అదే లైన్ను అప్గ్రేడ్ చేశామని చెప్పారు. నూతన సాంకేతికతను కనుగొని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని ప్రభాకర్రావు వివరించారు. ఈ సమావేశంలో ఎస్సార్పీసీ సభ్య కార్యదర్శి అసిత్సింగ్, ఆయా రాష్ర్టాల విద్యుత్తు సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.