హుస్నాబాద్, డిసెంబర్ 1: దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను బీజేపీ తన సొంతానికి వాడుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నా మోదీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ర్టాల్లో మాత్రం ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో కక్షపూరితంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.