హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 714 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియను 2 నెలల్లోగా పూర్తిచేసి, వారి ప్రొబేషన్ను ప్రకటించాలని, వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరు తదితర సర్వీస్ అంశాలపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కే శరత్ ఉత్తర్వులు జారీచేశారు. జూనియర్ లెక్చరర్ల పిటిషన్లపై సోమవారం ఆయన విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. 2023 మే 1న జారీచేసిన జీవోలు 19, 20, 21 ద్వారా జూనియర్ లెక్చరర్ల సేవలను క్రమబద్ధీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రొబేషన్ను ప్రకటించలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లను కూడా మంజూరు చేయకపోవడంతో జీతభత్యాలు, ప్రమోషన్లు, సర్వీస్ సీనియారిటీ, ఇతర ఉద్యోగ ప్రయోజనాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వివరించారు. ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండా ఇంక్రిమెంట్లను నిలిపివేశారని, ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను భిన్నంగా పరిగణించడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హకుకు విరుద్ధమని పేరొన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. దాదాపు 70% మంది జూనియర్ లెక్చరర్లు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్లను సమర్పించారని, అధికారులు ఆయా విద్యాసంస్థలకు వెళ్లి రికార్డులను పరిశీలిస్తూ ధ్రువీకరణ చేపడుతున్నందున కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రక్రియను 2 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది.