గ్రాంట్లు ఇచ్చే విధానానికి ఇకపై స్వస్తి
పీఎం మిత్ర పథకంలో కఠిన నిబంధనలు
రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యం తగ్గించే కుట్ర
కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)ను అభివృద్ధి చేసింది. దక్షిణ కొరియా వస్త్ర దిగ్గజం యంగ్వన్, కేరళకు చెందిన కిటెక్స్, దేశంలో పేరెన్నికగన్న వస్త్ర కంపెనీ గణేశా ఇకోసిఫెర్ తదితర 16 కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకొన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కేఎంటీపీకి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం రాకముందే అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు. తాజాగా పీఎం మిత్ర మార్గదర్శకాల ప్రకారం టెక్స్టైల్ పార్కుల్లో కేంద్రానికి 49 శాతం వాటా ఇస్తేనే నిధులు ఇస్తామని మెలిక పెట్టింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ర్టాల చెమట చుక్కలతో నిర్మాణమవుతున్న పారిశ్రామిక సౌధాలపై కేంద్ర ప్రభుత్వ పడగ నీడ కమ్ముతున్నది. మేక్ ఇన్ ఇండియా, సమృద్ధ భారత్ అని గప్పాలు కొంటుకొంటూ రాష్ర్టాల శ్రమను తనదిగా చెప్పుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అని నినాదాలిస్తూనే.. ఒక్కో రంగంలో సమాఖ్య స్ఫూర్తికి నీళ్లొదులుతున్నది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేస్తే, కేంద్రం దానికి ఎంతోకొంత సహాయం చేయటం ఆనవాయితీ. తాజాగా బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలో పీఎం మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆ సంప్రదాయానికి మంగళం పాడింది. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, నిర్వహణలో రాష్ర్టాల ప్రాధాన్యాన్ని తగ్గించింది. టెక్స్టైల్ పార్కుల అభివృద్ధిలో 49 శాతం వాటా తమది ఉంటుందని, తాము రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే పార్కులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా పీఎం మిత్ర పథకం మార్గదర్శకాలను జారీచేసింది.
ఏమిటీ పథకం?
దేశంలో వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయటానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అప్పెరల్ పార్క్స్(మిత్ర) పథకాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది జనవరిలో 15న మార్గదర్శకాలు విడుదల చేసింది. మెరుగైన నిర్వహణ, వ్యాల్యూ చెయిన్ ఏర్పాటు చేయడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ పథకం లక్ష్యాలు. ఇందులో భాగంగా భారీ, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన మొత్తం వ్యాల్యూ చెయిన్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్, టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రింటింగ్ వంటి దశల్లో పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. పథకం కింద పరిపాలనా ఖర్చులు రూ.30 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 4,445 కోట్లు కేంద్రం కేటాయించింది. 2027-28 వరకు ఈ నిధులను ఖర్చుచేయాలని నిర్ణయించింది.
షరతులు అంగీకరించాల్సిందే
ఈ పథకంలో రాష్ర్టాలు చేరాలంటే కేంద్ర విధించే ప్రతి షరతుకు అంగీకరించాల్సి ఉంటుంది. 49 శాతం వాటా తీసుకోవటం ద్వారా పార్కు నిర్వహణను కేంద్రం నియంత్రించే అవకాశం ఉంటుంది. నిజానికి తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ర్టాలు ప్రపంచమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి నేరుగా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నాయి. సొంత పారిశ్రామిక విధానాలతో పోటాపోటీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం అన్నింటికంటే ముందున్నది. మిత్ర పథకంలో ఏర్పాటుచేసే టైక్స్టైల్ పార్కులో పెట్టుబుడులు పెట్టించేందుకు రాష్ర్టాలే కంపెనీలను ఒప్పించాల్సి ఉంటుంది. నానా కష్టాలుపడి, రాయితీలు ఇచ్చి కంపెనీలను తీసుకొచ్చిన తర్వాత, ఆ కంపెనీలకు కేంద్రం మోకాలడ్డితే పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఓ పథకం పెట్టి బలవంతంగా వాటాలు ఇవ్వాలనుకోవటం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు. రాష్ర్టాలు తమ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసే పార్క్లకు ఆర్థికసాయం చేసి చేయూతనందిస్తే సరిపోతుంది కదా అని సూచిస్తున్నారు.
పెండింగులో కేఎంటీపీ ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)ను అభివృద్ధి చేసింది. ముడి సరుకు లభ్యత, నైపుణ్యంగల కార్మికులు, దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైలు మార్గాలు ఉండటం తదితర అంశాలు దీని అనుకూలతలు. పార్క్లో రోడ్లు, ప్రహారీ గోడల నిర్మాణం పూర్తయింది. రెండువేల ఎకరాల్లో ఇప్పటి వరకు 1,190 ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజక్టు అంచనా వ్యయం రూ. 1,150.47 కోట్లు కాగా, రూ.11,586 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశమున్నది. దేశంలో ఎక్కడా ఇంత భారీస్థాయిలో టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. దక్షిణ కొరియా వస్త్ర దిగ్గజం యంగ్వన్, కేరళకు చెందిన కిటెక్స్, దేశంలో పేరెన్నికగన్న వస్త్ర కంపెనీ గణేశా ఇకోసిఫెర్ తదితర 16 కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం చేసుకొన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కేఎంటీపీకి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పీఎం మిత్ర పథకం రాకముందు నుంచే కేఎంటీపీ పనులు జరుగుతున్నాయి. అయినా ఇంతవరకు కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. తాజాగా పీఎం మిత్ర మార్గదర్శకాల ప్రకారం టెక్స్టైల్ పార్కుల్లో కేంద్రానికి 49 శాతం వాటా ఇస్తేనే నిధులు ఇస్తామని మెలిక పెట్టింది.
పీఎం మిత్ర పథకం మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి