హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పాడిందే పాటరా అన్నట్టు ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత లెక్కల ఎక్కాలు వల్లెవేసింది. పార్లమెంటు సాక్షిగా మసిపూసి మాయచేసే ప్రయత్నం చేసింది. ధాన్యం సేకరణలో కేంద్రప్రభుత్వ వివక్షాపూరిత వైఖరిని నిరసిస్తూ ఐదురోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి శుక్రవారం ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా తోడయ్యారు. ఒడిశా, బెంగాల్, తమిళనాడు తదితర రాష్ర్టాలకు చెందిన 9 పార్టీలు ఉమ్మడిగా కేంద్రంపై పోరాటం మొదలుపెట్టాయి. ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్కు చెందిన ప్రసన్నాచార్య ‘ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం తీసుకోకపోతే బంగాళాఖాతంలో పారబోయాలా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇంతకాలం మొండిగా వ్యవహరించిన కేంద్రం, ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావటంతో ఎట్టకేలకు ధాన్యం సేకరణపై రాజ్యసభలో సమాధానమిచ్చింది. టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సురేశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానాలిచ్చారు. సభను, రాష్ట్ర రైతులను గందరగోళపర్చి తప్పుదోవ పట్టించటానికే ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు.
గత యాభై రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులతో చెప్పిన.. చెప్తూ వచ్చిన లెక్కలనే పీయూష్ గోయల్ మళ్లీ మళ్లీ వల్లెవేశారు. రాష్ట్ర ప్రభుత్వమే బాయిల్డ్ రైస్ ఇవ్వనని రాసిచ్చిందన్న గోయల్.. ఆ విధంగా లేఖ రాసిస్తేనే గత యాసంగి బియ్యాన్ని కొంటామని ఎఫ్సీఐ లిఖితపూర్వకంగా పెట్టిన షరతు గురించి మాత్రం కన్వీనియంట్గా మర్చిపోయారు. మెడమీద కత్తిపెట్టి రాయించుకొని.. తెలంగాణే తనంత తానుగానే రాసిచ్చినట్టుగా పేర్కొన్నారు. టార్గెట్ ఇచ్చిన మేరకు బియ్యం ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపైకి నెపం నెట్టడానికి ప్రయత్నించారే తప్ప.. తెలంగాణ నుంచి వచ్చే లారీలు ఎఫ్సీఐ గోదాముల దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తున్నాయో మాట్లాడలేదు. ఎఫ్సీఐ గోదాముల్లోకి అన్లోడ్ చేసుకోకపోవడం, రైల్వే రేక్స్ను కూడా ఇవ్వకపోవడం గురించి కూడా ప్రస్తావించలేదు. గోయల్ మాటలు.. తలుపులు మూసుకొని లోపలకి రావడం లేదన్నట్టుగా ఉన్నాయి. ధాన్యం సేకరణను అన్ని రాష్ర్టాలకు పెంచినట్టుగానే.. తెలంగాణకూ పెంచారు. అది కూడా ప్రత్యేకంగా మెహర్బానీ చేసినట్టు చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణపై దేశమంతా ఒకే విధానం అమలు చేస్తామని చెప్పిన గోయల్.. మరి పంజాబ్లో నూటికి నూరుశాతం కొంటూ.. తెలంగాణకు కొర్రీలు పెట్టడం ఒకే విధానం ఎలా అవుతుంది?
టీఆర్ఎస్ ఎంపీలు గతాన్ని భవిష్యత్తుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. సాగు సీజన్కు ముందే ఏ పంట వేయాలో జాగ్రత్త పడకుండా ఉంటే.. మునిగిపోయేది రైతుకాదా? రైతులు పండించిన తర్వాత కేంద్రం కొనకపోతే. బయట అమ్ముడుపోకపోతే.. రైతు ఏం కావాలి? అతని బతుకు ఏం కావాలి? రైతులను గైడ్ చేయాలని, ఇతరపంటలవైపు మళ్లించాలని చెప్తున్నది కేంద్రం కాదా? అలాంటప్పుడు ఒక లక్ష్యం నిర్ధారించడానికి కేంద్రానికి అడ్డుపడుతున్నది ఏమిటి? రాజకీయం కాకపోతే?
బీజేపీ పగ బట్టబయలైంది. కేంద్రం దగా తేటతెల్లమైంది. మాటలతో ఎంత మాయ చేయాలని చూసినా.. లెక్కల ఎక్కాలు వల్లెవేసినా.. అవన్నీ కట్టు కథలేనని స్పష్టమైంది.
పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు కేంద్ర మంత్రులు రెండు రోజులుగా విస్పష్టంచేసిన మాట ఒక్కటే..
పార్బాయిల్డ్ రైస్ కొనం.
మన రైతు మాటల్లో చెప్పాలంటే..యాసంగి వడ్లు ఇకపై కేంద్రం కొనదు. గత రెండు మాసాలుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్కు చెందిన పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, అన్నదాతలు.. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఒక్కటే మాట.. తెలంగాణలో యాసంగి వడ్లు కొంటరా? కొనరా?
దేశ అత్యున్నత శాసన వ్యవస్థ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన మాట ఒక్కటే..
తెలంగాణలో యాసంగి వడ్లు కొనబోం
లోక్సభలో గురువారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడినా.. మరో సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ మన ఎంపీల ప్రశ్నకు జవాబిచ్చినా.. శుక్రవారం రాజ్యసభలో కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్ కాగితాల కట్ట పట్టుకొని కనికట్టు చేసినా.. ఇన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల లెక్కలు.. లేఖలు.. మాటలు.. ఆటలు.. యాత్రలు.. విదూషక పాత్రలు.. ధర్నాలు-దీక్షలు అన్నీ కూడా నాటకాలేనని స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యమేమిటి? తెలంగాణ సాగుకు ముందున్న మార్గమేమిటి?
మన రైతన్నల సమస్యకు పరిష్కారమేమిటి?
యాసంగిలో వరి వేయొద్దు
కేంద్రం కొననంటున్న వడ్లను పండించొద్దు.. రైతన్న తనను తాను దండించు కోవద్దు.. మరి మనం శిక్షించాల్సింది ఎవరిని? 24 గంటల ఉచిత కరెంటు సరఫరా, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, రైతు బంధు సమితులు, ఎరువులు, విత్తనాల సరఫరా, పన్ను మాటే లేని సాగునీటి పారుదలతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతన్నను ఆశపెట్టి, గోసపెట్టిన బీజేపీకి బడిత పూజ జరగాలి. వారి దుర్మార్గానికి భరతవాక్యం పలకాలి. ఉత్తరాది కర్షకులు ఎలాంటి పట్టుదలతో, బీజేపీ మెడలు వంచారో.. అలాంటి చిత్తశుద్ధి మన తెలంగాణ రైతన్నల్లోనూ కనిపించాలి. కమలనాథుల కాకమ్మ కబుర్లకు, కల్లబొల్లి మాటలకు, కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్లకు మోసపోవడానికి తాము అమాయకులం కాదని తెలంగాణ రైతన్నలు నిరూపించాలి.
కులాలకు, వర్గాలకు, జిల్లాలకు అతీతంగా అందరూ ఏకమై కదం తొక్కి.. పదం పలకాలి. రైతు వ్యతిరేక బీజేపీకి గుణపాఠం నేర్పాలి. అదే మన కర్తవ్యం, అదే మన దీక్ష.. అదే మన సంకల్పం కావాలి. ఏ వడ్లనైనా కొనగలిగే కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చుకొనేదాకా మన పోరాటం సాగాలి.