నందికొండ, డిసెంబర్ 3 : నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ బలగాలు సృష్టించిన రగడకు తెరపడింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం డ్యామ్ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ర్టాల మధ్య ఏర్పడిన గొడవ సద్దుమణిగింది. నవంబర్ 30వ తేదీ రాత్రి ఆంధ్రా అధికారులు, పోలీస్ బలగాలతో నాగార్జునసాగర్ డ్యామ్పైకి ప్రవేశించి, 13వ గేట్ వరకు తమదంటూ బారికేడ్లు, ముళ్లకంచె ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. కుడి కాల్వకు అక్రమంగా నీటిని విడుదల చేయడంతో తెలుగు రాష్ర్టాల మధ్య వివాదం ప్రారంభమైంది.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని శనివారం సీఆర్పీఎఫ్ బలగాలను నాగార్జునసాగర్డ్యామ్ వద్దకు పంపించింది. ఆదివారం సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జునసాగర్ డ్యామ్ను స్వాధీనం చేసుకొని అక్కడున్న బారికేడ్లు, ముళ్లకంచెను తొలగించారు. ఈ క్రమంలో ఏపీ బలగాలు వారితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాయి. కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు తెలంగాణ, ఆంధ్రా పోలీసులను డ్యామ్పైకి అనుమతించేది లేదని సీఆర్పీఎఫ్ బలగాలు స్పష్టం చేశాయి. కుడి కాల్వకు కొనసాగుతున్న నీటి విడుదలను కేఆర్ఎంబీ అధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రా అధికారులు శనివారం రాత్రి నిలుపుదల చేశారు.