హైదరాబాద్ : తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అవుతుందని ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసింది. దేశంలో ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలే ప్రస్తుత అవసరాలను తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వేశాఖ తేల్చిచెప్పింది. కానీ కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు కేటాయించి, తెలంగాణకు మొండి చేయి చూపింది. మహారాష్ట్రలోని లాతూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశలో ఉన్నాయని తేలింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం తెలంగాణకు కేటాయిస్తామన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంత వరకు ఎందుకు మంజూరు కాలేదని, ఎందుకు తాత్సరం కొనసాగుతోందని సామాజిక కార్యకర్త ఐ రవికుమార్.. సమాచార హక్కు చట్టం కింద రైల్వే శాఖకు దరఖాస్తు పెట్టాడు.
రవికుమార్ దరఖాస్తుకు రైల్వే శాఖ సమాధానం ఇస్తూ పలు విషయాలను వెల్లడించింది. 2018, ఏప్రిల్లో మహారాష్ట్రలోని లాతూర్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేటాయించినట్లు తెలిపింది. అదే ఏడాది ఆగస్టు నెలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. రూ. 625 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టగా, 2021, సెప్టెంబర్ 7 నాటికి రూ. 567 కోట్ల పనులు పూర్తయినట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తవుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. భవిష్యత్లో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉండదని భావిస్తున్నట్లు రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది.
సికింద్రాబాద్లో పీపీపీ విధానంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 2010, ఫిబ్రవరి 24న అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటన చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సికింద్రాబాద్లో తగినంత స్థలం కేటాయించడం కష్టమని భావించిన నాటి ప్రభుత్వం.. 2011-12లో కాజీపేటలో 40 ఎకరాలను కేటాయించింది. కాజీపేటకు రైల్వే శాఖ వ్యాగన్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. ఆ తర్వాత పనులు ఆపేసింది. దేశంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు కోచ్ ఫ్యాక్టరీలే ప్రస్తుత అవసరాలను తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని, కొత్త వాటి అవసరం లేదని 2016, మార్చి 11న నాటి కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు నాటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానం ఇచ్చారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లోని 10వ అంశం కింద తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని చేర్చారు. దీనిపై అధ్యయనానికి సీనియర్ అధికారులతో రైల్వే శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని, ప్రస్తుతం ఉన్నవాటితోనే అవసరాలు తీరిపోతాయని ఆ కమిటీ అధ్యయనంలో తేలిందని రైల్వే శాఖ సమాచార హక్కు చట్టం కింద ఓ ప్రశ్నకు బదులిచ్చింది. కానీ మహారాష్ట్రలోని లాతూర్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి.. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఆ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.