కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూచన
ఎమ్మెల్యే జోగు రామన్న వెల్లడి
ఆదిలాబాద్ పట్టణ బంద్ సంపూర్ణం
స్వచ్ఛందంగా మద్దతు పలికిన ప్రజలు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 4 : మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సీసీఐని తిరిగి ప్రారంభించాలంటూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతం అయ్యింది. బంద్లో పాల్గొన్న జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐని ప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా ఫలితం లేదన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్తోపాటు ఇతర మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి సీసీఐ ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్టు గుర్తుచేశారు. సీసీఐ నిర్వహణకు విశాలమైన 772 ఎకరాల ప్రాంగణం, 170 ఎకరాల టౌన్షిప్, 1,500 ఎకరాల్లో 48 మిలియన్ టన్నుల సున్నపు రాయి నిల్వలు అందుబాటులో ఉం డటంతోపాటు 2కేవీఏ విద్యుత్తు సరఫరా, నీటి లభ్యత సైతం ఉన్నట్టు మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర భారీపరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ బంద్కు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందించారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. జీపులు, ఆటోలు కూడా రోడెక్కకపోవడంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జీ నగేశ్, సాధన కమిటీ సభ్యులు ఉదయమే ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. సీసీఐ ప్రారంభ నినాదం ప్రజాఉద్యమంగా మారిందని, కేంద్రలోని బీజేపీ సర్కారు స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సాధన కమిటీ సభ్యులు స్పష్టంచేశారు.
ఎల్ఐసీ విక్రయాన్ని ఒప్పుకోం
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐసీని తెగనమ్మేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కరపత్రాల రూపంలో సామాన్యులకు తెలియజేస్తున్నారు. శుక్రవారం సీబీ7 హైదరాబాద్శాఖ సెక్రటరీ వీ రమేశ్గౌడ్, శర్మ, రమణ, ఇంద్ర, ప్రతిభ, సుమరంజిత, సురేశ్ తదితరులు కరపత్రాలను ముద్రించి పంచుతున్న దృశ్యం.