‘ప్రాజెక్టుల’ నోటిఫికేషన్ను విరమించుకోవాలి
కేంద్రానికి సీపీఐ జాతీయ సమితి డిమాండ్
హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ సమితి డిమాండ్ చేసింది. చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోవడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి, హక్కులను హరిస్తున్నదని మండిపడింది. ఢిల్లీలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అన్ని రాష్ర్టాల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలో నీటి మౌలిక వసతులను ఒక నోటిఫికేషన్తో స్వాధీనం చేసుకొనే అధికారం ఎక్కడా కట్టబెట్టలేదని అన్నారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలను అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీలో శాఖ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి నాయకత్వానికి వయో పరిమితి 75 సంవత్సరాలకు మించరాదని సమావేశంలో తీర్మానించారు.