సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్కరణలపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపూరితమైనవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించినందునే బీజేపీ సర్కారు ఇటువంటి లీకేజీలు ఇస్తున్నదని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ గతంలో ఇదే జరిగిందన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొంటున్నట్టు ప్రకటించి మళ్లీ అవే చట్టాలను తీసుకొస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన గుర్తుచేశారు.
గురువారం మంత్రి సూర్యాపేటలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మోటర్లకు మీటర్లపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. విద్యుత్తు సంస్కరణల మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదన్నారు. సంస్కరణలు ప్రతిపాదించిన రోజు కేంద్రం పంపిన దానికి ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ లేఖ ద్వారా స్పష్టం చేస్తారన్నారు. తాజాగా వస్తున్న లీకేజీలపై కేంద్రం రాష్ర్టాన్ని సంప్రదిస్తే ప్రజల గొంతుకకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారని తెలిపారు. విద్యుత్తు, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటిదని పేర్కొన్నారు.