సూర్యాపేట/చిక్కడపల్లి/మిర్యాలగూడ టౌన్/బొడ్రాయిబజార్, జనవరి 26 : కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు తెలిపాయి. రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతు సంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం, సీపీఐ నాయకులు వినోద్నాయక్, బంటు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ, రైతుకూలీ సంఘం నేత మండారి డేవిడ్కుమార్ పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.