క్షేత్రస్థాయి తనిఖీల పేరిట ఇబ్బందులు
దమ్ముంటే గన్నీ బ్యాగులు ఇప్పించండి
తెలంగాణ బీజేపీ ఎంపీలకు
మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్
కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే బీజేపీ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడి యా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న కొనుగోళ్లు, ఏర్పాటు చేసిన కేంద్రాలు, డబ్బుల చెల్లింపుల వంటి వాటిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఉత్పత్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్య త అని, వాటిని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్సీఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు.. రాష్ట్రంలోని 2,900 రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట బీజేపీ సర్కారు కేంద్ర బృందాల ద్వారా దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఇది తనిఖీలు చేసే సమయం కాదని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ నడుస్తున్నదని, కావాలంటే జూలైలో వస్తే తాము కూడా సహకరిస్తామని పదే పదే చెప్పినా వినకుండా దాడులకు పూనుకున్నదన్నారు. ఒక్కో రైస్మిల్లు వద్ద మూడు, నాలుగు రోజులు తనిఖీలు చేయడం వల్ల ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యం దించుకోవడానికి సదరు మిల్లుల్లో వీలుపడటం లేదని, ఫలితంగా నిల్వలు పేరుకుపోయి.. రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నదన్నారు.
తెలంగాణ సర్కారును బద్నాం చేసేందుకు కేంద్రం ఇలాంటి కుట్రలకు పాల్ప డుతున్నదని ఆరోపించారు. ఈ పరిణామాలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కాదన్నా.. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు కేటాయించి కొనుగోలు చేస్తున్న తీరును కేంద్రం జీర్ణించుకోవడం లేదన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని, ధాన్యం కొనడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వడంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తే.. రైతులకు ఇబ్బందులు రాకుండా.. తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే 8నుంచి 9 కోట్ల గన్నీ బ్యాగులను వివిధ రకాలుగా సమకూర్చుకున్నదన్నారు. మీడియా సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.