పంటలకు మద్దతు ధర పెంపులో అన్యాయం
కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం
ద్రవ్యోల్బణంతో పోలిస్తే దిగజారిన ఎమ్మెస్పీ
నూనెగింజలు, పప్పులపై అదే చిన్నచూపు
రైతుల నడ్డి విరుస్తున్న డీజిల్, ఎరువుల ధరలు
కర్షకుల కష్టాలు పట్టించుకోని మోదీ సర్కార్
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎడాపెడా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై పెట్టుబడి భారం మోపుతున్న కేంద్రం ఆ స్థాయిలో పంటలకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం పెంపు బారెడు- మద్దతు ధర పెంపు మూరెడు అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. ఇందుకు నిదర్శనం కేంద్రం తాజాగా ప్రకటించిన పంటల మద్దతు ధరలే. ఒకటి రెండు మినహా మెజారిటీ పంటలకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర పెంచలేదు. డీజిల్, ఎరువుల ధరల కారణంగా ఒక్క ఏడాదిలోనే పెట్టుబడి వ్యయం దాదాపు 30% పెరిగిందనేది వ్యవసాయ నిపుణుల అంచనా. కానీ కేంద్రం పెంచిన మద్దతు ధర 6% లోపే ఉన్నది.
ద్రవ్యోల్బణం పైకి.. మద్దతు ధర కిందికి
ద్రవ్యోల్బణం పెరుగుదలతో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మద్దతు ధర పెంచితే రైతులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పైపైకి వెళ్తుంటే.. ఆచరణలో మద్దతు ధర కిందికి దిగజారుతున్నది. ఈ ఏడాది మ ద్దతు ధరను అత్తెసరు పెంపుతో సరిపెట్టింది. ఈ ఏడా ది ద్రవ్యోల్బణం రేటు 6.7% ఉంటుందని రిజర్వ్బ్యాంకు అంచనా. రైతులు నష్టపోకూడదంటే పంటల మద్దతు ధర పెంపు అంతకుమించి ఉండాలి. కానీ కేం ద్రం సోయాబీన్ (8.8% ), జొన్న (8.4%), నువ్వు లు (7.1%) పంటలకు మాత్రమే ద్రవ్యోల్బణానికి మించి మద్దతు ధర పెంచింది. మిగిలిన 11 పంటలకు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా పెంచడం గమనార్హం. అత్యధికంగా సాగు చేసే ప్రధాన పంటలకు నామమాత్రంగానే మద్దతు ధర పెంచి, చేతులు దులుపుకొన్నది.
వరి వద్దంటది.. మిగిలిన పంటలకు మద్దతేది?
వరికి బదులుగా పప్పులు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ర్టాలపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. తెలంగాణలో వడ్లు కొనేదిలేదని భీష్మించింది. ఇతర పంటలను ప్రోత్సహించాలని చెప్తున్న కేంద్రం అందుకు తగ్గట్టుగా రైతులకు ప్రోత్సాహకాలు అందించడం లేదు.పప్పులు, నూనెగింజలకు మద్దతు ధరను అతి తక్కువగా పెంచింది. పెసరలు క్వింటా సాగుకు రూ.10,217 వ్యయం అవుతుంటే.. మద్దతు ధర రూ.7,755 మాత్రమే ఉన్నది. గత సంవత్సరంతో పోలిస్తే పెసరకు మద్దతు ధర 6.5 శాతమే పెరిగింది. కంది క్వింటా సాగుకు రూ.12,016 ఖర్చు కా గా మద్దతు ధర రూ.6,600 మాత్రమే. మద్దతు ధర పెంపుదల 4.7 శాతమే ఉన్నది. జొన్నలు క్వింటాలు సాగుకు రూ.12,595 ఖర్చు కాగా మద్దతు ధర రూ.2,970 మాత్రమే. వేరుశనగ క్వింటా సాగుకు రూ.6,615 కాగా మద్దతు ధర రూ.5,850గా ప్రకటించింది. వేరుశనగ మద్దతు ధర పెంపు 5.4 శాతమే ఉన్నది. నూనెగింజలు, పప్పు పంటలకు మరింతగా మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఉన్నదని, లేని పక్షంలో రైతులు ఈ పంటల సాగుకు ముందుకు రారని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.
స్వామినాథన్ సిఫారసులు బుట్టదాఖలు
పంటలకు మద్దతు ధర విషయంలో స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని, మద్దతు ధరకు ప్రత్యే క చట్టాన్ని తీసుకొస్తామని అధికారంలోకి రాకముందు మోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ సిఫారసుల అమలు సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రత్యేక చట్టం కుదరదని చెప్పారు. తూతూ మంత్రంగా మద్దతు ధరలను పెంచుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదనే విమర్శలున్నాయి. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలను పెంచుతున్న కేంద్రం అదే స్థాయిలో మద్దతు ధర ఎందుకు పెంచడం లేదని రైతులు, వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.