హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా వాహనాలనే ఆధారం చేసుకొని ఎంతోమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. వీరందరి నెత్తిన కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. బీజేపీ సర్కారు అనాలోచితంగా తీసుకొచ్చిన ‘మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714’.. వాహనాలే ఉపాధిగా జీవనం సాగిస్తున్నవారిని నట్టేట ముంచేలా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ 714 కింద ఈ నెల 1 నుంచి ఆర్ఆర్ (రీ రిజిస్ట్రేషన్), ఫిట్నెస్ రూపంలో వసూలు చేస్తున్న ఫీజులు చూస్తే.. వాహనాల ఖరీదుకంటే ఎక్కువ ఉన్నాయి.
సాధారణంగా ఆటోకు 2019, జనవరిలో ఫిట్నెస్ ముగిసిపోతే, మళ్లీ దానికి ఫిట్నెస్ చేయించడానికి అయ్యే ఫీజు రూ.735. అందులోనే సర్వీస్ చార్జీ, పోస్టల్ చార్జీలు ఉండేవి. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం సదరు ఆటోకు ఫిట్నెస్ చేయించాలంటే సాధారణ ఫీజు రూ.735తోపాటు ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.50 చెల్లించాలి. ఈ లెక్కన 2019, జనవరి నుంచి 2022 మార్చి వరకు 38 నెలల్లో 1,140 రోజులు అవుతుంది. రోజుకు రూ.50 చొప్పున ఆలస్య రుసుము రూ.57 వేలు కట్టాలన్నమాట. దీనికి సాధారణ ఫీజు రూ.735 జత చేస్తే రూ.57,735 అవుతుంది. తమ ఆటోలు అమ్మినా లేట్ ఫీజుకు సరిపడా డబ్బు రాదని ఆటోడ్రైవర్లు లబోదిబోమంటున్నారు. కరోనా కారణంగా వాహనాలకు ఎంతోమంది రీ రిజిస్ట్రేషన్, ఫిట్నెట్ చేయించలేదు. ‘నా క్యాబ్కు ఫిట్నెస్ గడువు ముగిసి రెండున్నరేండ్లు అయింది. ఫీజు రూ.700 ఉంటే జరిమానాతో కలిపి రూ.47,050 చెల్లించాల్సి వచ్చింది’ అని హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ తిరుపతి వాపోయాడు. రీ రిజిస్ట్రేషన్ గతంలో రూ.1,500తో పూర్తయ్యేది. ఇప్పుడు లైట్ మోటర్ వాహనాలకే రూ.5 వేలు అవుతున్నది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయడంలో జాప్యం జరిగితే ప్రతినెలా రూ.500 అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలతో తాము ఉపాధి కోల్పోతున్నామని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
714నోటిఫికేషన్తో కేంద్రప్రభుత్వం డ్రైవర్ల బతుకులతో ఆడుకొంటున్నది. కరోనా లాక్డౌన్ సమయంలో ఆటోలపై ఉన్న ఫైనాన్స్లు చెల్లించలేక వేధింపులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఫిట్నెస్పై మోయలేని లేట్ ఫీజులు విధించటం హేయమైన చర్య. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 19న మహాధర్నా చేస్తున్నాం. బీజేపీ సర్కారుపై యుద్ధం చేసైనా 714 నోటిఫికేషన్ను రద్దు చేయిస్తాం.
-వేముల మారయ్య, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు.
రోజుకు రూ.50 చొప్పున లేట్ ఫీజు అంటే ఒక్కో ఆటోకు రూ.30 వేలు దాటుతున్నది. అంత డబ్బు ఎలా చెల్లించగలం? ఆటో అమ్మినా అంత రాదు. బండి అమ్ముకొని రోడ్డున పడాల్సిందేనా. ఫిట్నెస్ చేయించుకొనేందుకు గడువు ఇచ్చినా బాగుండేది. 714 నోటిఫికేషన్తో కేంద్రం మా బతుకులను ఆగం చేస్తున్నది.
–సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకుడు.
కొవిడ్ సమయంలో డ్రైవర్లు పన్ను చెల్లించలేని పరిస్థితులో ఉన్నారని ఫిట్నెస్, ఆర్సీల రెన్యూవల్కు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ కాలానికి కూడా పెనాల్టీ వేస్తున్నది. మొన్నటిదాకా కరోనాతో రోడ్డునపడ్డాం. పరిస్థితులు ఇంకా గాడిన పడనేలేదు. ఇలాంటి తరుణంలో కేంద్రం వాహనదారులపై పెను భారం మోపడం సిగ్గుచేటు.
–సలావుద్దిన్, ప్రెసిడెంట్, తెలంగాణ ట్యాక్సీ అసోసియేషన్.