హైదరాబాద్, మార్చి 17 : రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఈ ఏడాది కూడా పత్తి విత్తనాల ధర పెంచింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై రూ.43 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో గతేడాది రూ.767గా ఉన్న ప్యాకెట్ ధర రూ.810కి పెరిగింది. గతేడాది కూడా కేంద్రం ఒక్కో ప్యాకెట్పై రూ.37 పెంచింది. పత్తి విత్తనాల ధర పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే లేఖ రాసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజా పెంపుతో రాష్ట్ర రైతులపై దాదాపు రూ.70 కోట్ల అదనపు భారం పడనున్నది.
సాగు 80 లక్షల ఎకరాలు.. విత్తనాలు 1.60 కోట్ల ప్యాకెట్లు
2020-21లో రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల సాగు తగ్గింది. అయితే, ఈ ఏడాది పత్తికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో వానకాలంలో వరి కాకుండా అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో 2022-23లో సుమారు 75-80 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నదని అధికారుల అంచనా.