రైతులతో మోదీ సర్కారు బంతాట
ధాన్యం, గోధుమ స్టాక్ అంచనాల్లో విఫలం
మొన్నటిదాకా వరి వద్దే వద్దని లేఖలు
తెలంగాణ ధాన్యం కొనబోమని కిరికిరి
ఇప్పుడు వరిని ప్రోత్సహించాలని సూచన
కొరత ఉన్నా.. మన నుంచి కొనేందుకు నై!
రాష్ట్రంపై కొనసాగుతున్న కేంద్రం కక్ష
గోదాముల్లో ధాన్యం మురిగిపోతున్నది. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వ ఉన్నది. దీంతో రైతులను వరి సాగు నుంచి తప్పించి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించండి. ఎగుమతులకు కూడా అవకాశం లేదు. కాబట్టి కేంద్రం తరఫున బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదు.
– కేంద్ర ఆహార, ప్రజా సంబంధాల మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలివి.
దేశంలో వరి సాగు తగ్గింది. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. బియ్యం ఎగుమతులకు మంచి అవకాశం ఉన్నది. కాబట్టి రైతులను వరి సాగుకు ప్రోత్సహించండి
– మంగళవారం అదే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ర్టాలకు ఇచ్చిన సూచన ఇది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్నది. ధాన్యం, గోధుమల నిల్వల అంచనాల్లో విఫలమై.. ఏకంగా వ్యవసాయరంగాన్ని గందరగోళంలోకి నెడుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ ఉన్నా.. వరి సాగు వద్దని కేంద్రం మొన్నటిదాకా షరతులు విధించింది. ఓ దశలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ర్టాలకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో చాలా మంది రైతులు తమ పొలాలను బీడు పెట్టుకొని వరి సాగుకు దూరంగా ఉన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం రైతుల తరఫున పెద్ద పోరాటం చేసింది. అయినా కేంద్రం మొండి వైఖరి వీడలేదు. ఇప్పుడు మాత్రం అదే నోటితో మళ్లీ వరి సాగు చేయండంటూ పిలుపునిస్తున్నది.
ఎగుమతులపై స్పష్టత లేదు
మన దేశంలో ఉత్పత్తయ్యే బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నది. కేంద్రం లెక్కల ప్రకారం దేశం నుంచి 2020-21లో రూ.65,325 కోట్ల విలువైన 17.72 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యింది. ఇందులో నాన్ బాస్మతి బియ్యం వాటనే అధికం. బాయిల్డ్ రైస్ ఎగుమతికి అవకాశం లేదని తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలుకు నిరాకరించింది. కానీ, గత ఏడాది మొత్తం బియ్యం ఎగుమతిలో 12.99 శాతం బాయిల్డ్ రైస్ ఎగుమతి కావటం గమనార్హం. దీన్ని బట్టి ఎగుమతుల విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని తెలుస్తున్నది.
తెలంగాణ నుంచి నిరాకరణ
ధాన్యం అవసరం ఉన్నదని చెప్తున్న కేంద్రం.. తెలంగాణ నుంచి మాత్రం బియ్యం(సీఎమ్మార్) తీసుకొనేందుకు నిరాకరిస్తూనే ఉన్నది. గత నెల 7 నుంచి సీఎమ్మార్ స్వీకరణను కేంద్రం నిలిపేసింది. అంటే నేటికి సరిగ్గా నెల అవుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో మిల్లులన్నీ మూతపడ్డాయి. రాష్ట్రం ప్రభుత్వం ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం మాత్రం మొండిగానే వ్యవహరిస్తున్నది. గత రెండు సీజన్లకు కలిపి మొత్తంగా 92 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రం వద్దే ఉన్నది. దీని విలువ రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కానీ, రాష్ట్రంపై రాజకీయ కక్ష సాధించేందుకు సీఎమ్మార్ను తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.