జల వనరుల శాఖ గెజిట్ సరికాదు
కేంద్ర సర్కారు కుట్రను అడ్డుకోవాలి
నల్లగొండ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
నీలగిరి, ఏప్రిల్ 16: కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టించి, రాజ్యాంగ విరుద్ధంగా నదీ జలాలను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని ప్రధానంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేలా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకొంటూ కేంద్ర జలవనరుల శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్పై పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా నల్లగొండలో ఒక రోజు నిరసన దీక్ష చేయాలని తీర్మానం చేశారు.
2021 జూలై 12న కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన చేపట్టాలని తీర్మానం చేశారు. కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టిస్తున్నదన్నారు. రాష్ర్టాల జాబితాలోని నీటిని స్వేచ్ఛగా వాడుకొనే హక్కు రాష్ర్టాలదని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హక్కులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుద్ధమన్నారు. సమావేశంలో ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యుడు ఎంవీ గోనారెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.