కొరత సాకుతో కేంద్ర సర్కారు కుట్ర
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీఐజీ స్థాయి పోస్టులు 50 శాతం వరకు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీఎస్ అధికారులు ఐజీ ర్యాంకుకు చేరుకొనేలోపు ఎప్పుడైనా కనీసం మూడేండ్లపాటు కేంద్ర సర్వీసులో పనిచేయకుంటే ఆ తర్వాత వారిని డిప్యుటేషన్పై తీసుకొనే అవకాశం ఉండదు. దీంతో డిప్యుటేషన్పై వెళ్లాలనుకొనే అధికారులు నేరుగా ఐజీ స్థాయిలో వెళ్తున్నారు. కిందిస్థాయి పోస్టులన్నీ ఖాళీగా ఉంటున్నాయని కేంద్ర హోంశాఖ అంటున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేసి రాష్ర్టాలను నామమాత్రంగా మార్చే చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలుచేస్తున్నది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకొనేందుకు మరో వివాదాస్పద ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఐపీఎస్ అధికారులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), డిఫ్యూటీ డైరెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయిలో ఉండగానే కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్పై తప్పనిసరిగా పనిచేసేలా సర్వీస్ రూల్స్ మార్చాలని ప్రధాని కార్యాలయానికి కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు పంపింది. అలా పనిచేయని అధికారులు తమ కెరీర్ మొత్తంలో కేంద్ర సర్వీసులోకి డిప్యుటేషన్పై రాకుండా నిషేధం విధించాలని సూచించింది.
ఇది అఖిల భారత సర్వీసులపై ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకొన్న మూడో వివాదాస్పద నిర్ణయం. సివిల్ సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను రాష్ర్టాల అనుమతి లేకున్నా డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులోకి తీసుకొనేలా రూల్స్ మార్చాలని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై అన్ని రాష్ర్టాలకు లేఖలు రాయగా, చాలా రాష్ర్టాలు వ్యతిరేకించాయి. సెంట్రల్ సర్వీసులోకి డీఐజీ స్థాయి అధికారులను తీసుకొనే ప్రతిపాదనలు పరిశీలించే ఎంపానల్మెంట్ను కూడా బీజేపీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ చర్య ద్వారా కేంద్ర హోంశాఖ ఎప్పుడంటే అప్పుడు, ఏ అధికారినైనా డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులోకి రావాలని ఆదేశించే వీలు కలుగుతుందని సమాచారం.
ఎవరి వాదన వారిదే..
కేంద్రం ప్రతిపాదనపై ఐపీఎస్ అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. కేంద్ర సర్వీసులో పనిచేసే అవకాశం లభిస్తే ఏ అధికారీ వదులుకోరని, కానీ రాష్ర్టాలు తమను రిలీవ్ చేయకుండా ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులను కేంద్ర సర్వీసుకు పంపటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవటంలేదని అంటున్నారు. దీనిపై రాష్ర్టాల వాదన మరోరకంగా ఉన్నది. ఇప్పటికే తాము అఖిల భారత స్థాయి అధికారుల కొరత ఎదుర్కొంటున్నామని, ఉన్నవారిని కూడా కేంద్ర సర్వీసుకు పంపితే ప్రభుత్వాన్ని ఎలా నడుపాలని ప్రశ్నిస్తున్నాయి.
ఇది కేంద్రం నిర్వాకమే..
దేశంలో అఖిల భారత సర్వీసు అధికారులు, ముఖ్యంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల కొరత ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకొనే నెపంతో సివిల్ సర్వీస్ అధికారుల భర్తీలో ఐపీఎస్ల సంఖ్యను తగ్గించింది. అంతకుముందు సివిల్స్ రిక్రూట్మెంట్లో ఏటా 80-90 మంది ఐపీఎస్ పోస్టులు ఉండగా, వాజపేయి ప్రభుత్వం 35-40కి తగ్గించింది. 1999-2002 మధ్య ఏటా 35 ఐపీఎస్ పోస్టులనే భర్తీ చేసింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఏటా సగటున 85 మంది ఐపీఎస్ అధికారులు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో కొరత తీవ్రమైంది. ఇటీవలి కాలంలో చాలా రాష్ర్టాల్లో జిల్లా సంఖ్య రెట్టింపు కావటం కూడా సివిల్స్ అధికారుల కొరతకు ప్రధాన కారణాల్లో ఒకటని అధికార వర్గాలు అంటున్నాయి. అధికారుల కొరతను గుర్తించిన మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. 2009 నాటికి దేశవ్యాప్తంగా 4,000 ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా, 1,600 ఖాళీలు ఉన్నాయి. దీంతో ఏటా 150-200 పోస్టులను భర్తీ చేస్తూ వచ్చారు. అయినా 2020 జనవరి 1 నాటికి దేశంలో 908 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు.