హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఒక్క ఐటీ రంగంలో తెలంగాణ పోగొట్టుకున్న సంపద ఎంతో తెలుసా? అక్షరాలా రూ.2.19 లక్షల కోట్లు.. దాదాపు 70 లక్షల ఉపాధి అవకాశాలు. మోసకారి మోదీకి తెలంగాణపై ఉన్న రాజకీయ దుగ్ధకు మంజూరైన ఐటీఐఆర్ కూడా రద్దు అయిపోయింది. రాష్ర్టానికి ఒక్క పెద్ద ప్రాజెక్టును మంజూరు చేయకపోయినా యూపీఏ సర్కారు ఇచ్చిన దాన్ని కూడా రద్దుచేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్.. దీనినే సంక్షిప్తంగా ఐటీఐఆర్ అని అంటున్నాం. కనీసంగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతోపాటు ఏకంగా 70 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టును 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు ఇచ్చింది. కానీ, మోదీ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయారు.
గత ఎనిమిదేండ్లలో రాష్ర్టానికి కనీసం ఒక్కటైనా పెద్ద ప్రాజెక్టును మంజూరు చేయకపోగా, తెలంగాణకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును సైతం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసేశారు. అయినప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం మోదీ తరం కావడంలేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ర్టానికి వస్తున్న భారీ పెట్టుబడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2014లో తెలంగాణకు రూ.57 వేల కోట్ల ఐటీ పెట్టుబడులు రాగా.. ఇప్పుడు అవి ఏకంగా 200 శాతానికి పైగా పెరిగి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. 2021-22లో మన దేశ ఐటీ ఎగుమతుల సరాసరి వృద్ధిరేటు 17 శాతంగా ఉంటే.. తెలంగాణ ఏకంగా 26.1% వృద్ధిరేటును నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోపాటు ఇక్కడి భౌగోళిక, సామాజిక, వాతావరణ అనుకూలతలే ఇందుకు కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అనుకూలతలు తెలంగాణలో ఉండటంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఇలాంటి కంపెనీలతో హైదరాబాద్ కిటకిటలాడుతుండటంతో తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాలకు పెట్టుబడులను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచే చర్యలు చేపడుతున్నది. దీనికి ఐటీఐఆర్ కూడా తోడై ఉంటే.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐటీ కేంద్ర స్థానంగా తెలంగాణ ఎదిగేది.
హైదరాబాద్కు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూపీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్లో ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇందులో ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం నుంచి రూ.1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారీ రంగం నుంచి రూ.1.01 కోట్ల పెట్టుబడులు వస్తాయని నాడు అంచనా వేశారు. సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం, ఉప్పల్, పోచారం పరిధిలోని 201.99 చదరపు కిలోమీటర్ల (దాదాపు 49,912.6 ఎకరాల) విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. రెండు దశల్లో పూర్తి చేయాలనుకొన్న ఈ ప్రాజెక్టులో మౌలిక వసతుల కల్పనకే రూ.4,863 కోట్లు ఇవ్వాలని యూపీఏ సర్కార్ భావించింది. ఇదంతా జరిగి ఉంటే ప్రత్యక్షంగా 14.8 లక్షల మందికి, పరోక్షంగా 55.90 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి.
తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్న దుగ్ధతోనే మోదీ సర్కార్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది. పైపెచ్చు తెలంగాణపైనే అభాండాలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రాలేదని, అందుకే ఐటీఐఆర్ను రద్దు చేశామని 2016లో కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. డీపీఆర్తోపాటు ఐటీఐఆర్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రానికి సమర్పించామని కుండ బద్దలుకొట్టారు. వాటిని పరిశీలించి హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలని లేనిపక్షంలో మరో ప్రాజెక్టును మంజూరు చేయాలని పలు లేఖల ద్వారా విన్నవించారు. అయినా మోదీ సర్కారు స్పందించలేదు.